Visakha Ukku : కర్మాగారం సాధించిన నాటి నిబద్ధతకి ఇద్దరు మహామహులు సాక్ష్యంగా నిలిచారని చెప్పాలి. విశాఖ ఉక్కు Visakha Ukku ఆమరణ దీక్ష జరగడం కూడా కొద్దిమందికే తెలిసిన విషయం. స్వతంత్ర పోరాటం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం.. ఎలాంటి చరిత్ర కలిగి ఉన్నాయో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన ఆమరణ నిరాహార దీక్ష కూడా చరిత్ర కలిగి ఉంది. ప్రస్తుత తెలంగాణలో ఉన్న అదిలాబాద్ తోసహా అన్ని జిల్లాల నాయకులు, ప్రజలు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అడుగులు వేసారు.. నినాదాలతో హోరెత్తించారు. ఇలా ఉద్యమాలతో, ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన జరగడానికి ముఖ్య కారకులు తమనపల్లి అమృతరావు. ఆయన పట్టుదల ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తి అమృతరావు కొనసాగించారు.
అప్పటి దీక్ష – పట్టుదల ఆస్థాయిలో..
1950, 60 దశకాలు.. అంతకుముందు వరకూ దేశం, ప్రజలు, వ్యవస్థ.. కోసమే ఉద్యమించే వ్యక్తులు ఉన్న సమాజం అది. జవహర్ లాల్ ప్రధానిగా ఉన్న సమయంలో 1952లో పొట్టి శ్రీరాములు మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కోసం బలసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 52 రోజుల దీక్షతో ఆయన చేసిన ప్రాణత్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇదే సంకల్పంతో 1966లో తమనపల్లి అమృతరావు ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఉద్యమానికి ఊపిరిపోశారు. ఆయన భార్య కూడా పదిరోజుల పాటు దీక్షలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారం కోసం గాంధీగిరిలో ఆయన చేపట్టిన దీక్ష ఆంధ్రప్రదేశ్ ను కదిలించింది. యువతలో స్ఫూర్తి రగిలించింది. ఉద్యమాలు, ప్రాణ త్యాగాల అనంతరం 1970లో స్టీల్ ప్లాంట్ కు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వీరికి స్ఫూర్తినిచ్చింది స్వాతంత్రం కోసం గాంధీజీ చేసిన పోరాటం. ఇద్దరూ వారి బాటలో పయనించారు.. అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేశారు.
నేటి నాయకులు సిద్ధమా..?
అప్పట్లో జాతిని కదిలించే స్ఫూర్తివంతమైన ఉద్యమాలు ఉంటే.. ఇప్పుడు పార్టీలు, నాయకుల వ్యక్తిగత ఉనికి కాపాడుకునేందుకు మాత్రమే ఉద్యమాలు సిద్ధమవుతున్నాయి. ప్రజలు నాయకుల్ని, అప్పుడూ నమ్మారు.. ఇప్పుడూ నమ్ముతూనే ఉన్నారు. కాకపోతే ప్రజల కోసం నిస్వార్ధంగా పోరాటం చేసే వారు కరువయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉక్కు సంకల్పం చేపట్టిన తమనపల్లి అమృతరావు తరహాలో.. ఇప్పుడు అదే ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఆమరణ నిరాహారదీక్ష పక్కనపెట్టి.. కనీసం నిరహార దీక్ష చేసేదెవరు అనేదే ప్రశ్న. రెండేళ్లుగా ఉనికిలో లేని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో వెంటనే స్పీకర్ రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాశారు. అయితే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యాకే రాజీనామా ఆమోదించాలని చెప్పడం నేటి రాజకీయ నేతల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. వైసీపీ నేతలు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం అని ప్రకటించారు తప్పితే.. ఎవరు చేస్తారో.. నాయకులు ఎవరు ముందుకొస్తారో తెలీని పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.
బీజేపీ-టీడీపీ-జనసేన.. ఇలా
గతంలో సీఎంగా అమరావతికి ఊపిరి పోసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావంగా ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. ఆయనే దీక్షలో కూర్చుంటే పరిస్థితి మరింత ఊపందుకునేది. వయసు కోణంలో ఆలోచిస్తే తనయుడు లోకేశ్ కూడా ప్రకటనలకే పరిమితం. ఇప్పుడు విశాఖ ఉక్కు వంతు వచ్చింది. ఇప్పుడు కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్తున్నారే కానీ.. ముందుండి నడిపించే వారు లేరు. బీజేపీ కూడా ఇదే పరిస్థితి. కేంద్రం నిర్ణయాలతో మింగలేక కక్కలేక ఉన్న పరిస్థితుల్లో కనీసం ఒక్క మాట మాట్లాడాలంటేనే వారిలో వణుకు పుడుతోంది. ఉద్యమం సంగతి సరేసరి. జనసేన అధినే పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు బీజేపీతో దోస్తీలో ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, భవన నిర్మాణ కార్మికులు, రైతుల కోసం పోరాటం చేసిన చందాన పవన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇన్ని సశేషాల మధ్య విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ఆనాటి వ్యక్తులు చూపించిన తెగువ నేటి నాయకుల్లో చూపేదెవరో.. కాలమే చెప్పాలి.