హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికల ప్రచారం ముగిసింది. నిజామాబాద్ ఎంపి స్థానంలో సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారానికి అనుమతిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారానికి ముగింపు పలికారు.
ఈ నెల 11 న రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. గురువారం 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. నిజామాబాద్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లు ఉండగా ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా అత్యల్పంగా మెదక్ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం ఏమాత్రం లేదని అడిషనల్ డిజి జితేందర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో దాదాపు 55 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారనీ, కర్నాటక, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ నుంచి బలగాలు రప్పించామని తెలిపారు.
రాష్ట్ర సరిహద్దుల్లోనూ అదనపు బలగాలను మోహరించామనీ, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మాత్రం సిఆర్పిఎఫ్ బలగాల భద్రత ఉంటుందనీ ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో 410 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయని అన్నారు. ఇప్పటి వరకు 39.89 కోట్ల రూపాయల నగదును, 1.01 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, 423 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయనీ, నాలుగు వేల అరెస్ట్ వారెంట్లను జారీ చేశామనీ జితేందర్ వివరించారు.