తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ముందే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్లపాటు రాజకీయంగా అధికారంలో ఉండి రాష్ట్రాన్ని తన కనుసైగలతో శాసించారు. కేసీఆర్ గత ఎన్నికలలో పార్టీ ఓడిపోవడంతో పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అయితే కేసీఆర్ కామారెడ్డి తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేశారు. గజ్వేల్ లో గెలిచిన ఆయన కామారెడ్డిలో ఓడిపోయారు. ఇది నిజంగా కేసీఆర్కు వ్యక్తిగతంగా దారుణ పరాజయం లాంటిది.
కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నించిన అస్సలు వాళ్లను దగ్గరకు కూడా రానివ్వలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే గెలిచామని కెసిఆర్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రెండు కమ్యూనిస్టు పార్టీలు టిఆర్ఎస్ తో పొత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కెసిఆర్ వారిని ఏమాత్రం లెక్కచేయలేదు. సొంతంగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ చాలా తెలివిగా కమ్యూనిస్టులను దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేసింది. సిపిఎం కాంగ్రెస్ తో కలవకపోయినా.. సిపిఐకు కొత్తగూడెం సిటీ ఇచ్చి పొత్తులో కలుపుకుంది. అది కాంగ్రెస్కు చాలా మేలు చేసింది.
ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ బీఎస్పీతో పొత్తుకు సిద్ధమవుటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి తెలంగాణలో బీఎస్పీకి దళితుల్లో కూడా పెద్దగా ఆదరణ లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్ర మొత్తం మీద మూడున్నర లక్షల ఓట్లు కూడా రాలేదు. అయినా కూడా కేసీఆర్ ఈసారి పొత్తులో ఏకంగా ఒకటి కాదు రెండు పార్లమెంటు స్థానాలను బిఎస్పీకు ఇచ్చేస్తున్నారు. కమ్యూనిస్టులు ఒక్క అసెంబ్లీ సీటు అడిగితేనే వారిని దగ్గరకు రానివ్వని కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా రెండు పార్లమెంటు స్థానాలను ఇచ్చేస్తున్నారు అంటే టిఆర్ఎస్ బలం పడిపోయిందా లేదా ? పోటీ చేస్తే గెలుస్తాం అన్న ధీమా కేసీఆర్లో సడలిందా అన్నది తెలియటం లేదు.
విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు నాగర్ కర్నూల్ సిట్టింగ్ స్థానాన్ని బిఎస్పీకి ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది.. అయితే ఇప్పుడు నాగర్ కర్నూల్ తో పాటు టిఆర్ఎస్ కు పట్టున్న అదిలాబాద్ స్థానాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ఇంతలా ఎందుకు ఆందోళన చెందుతున్నారో బిఆర్ఎస్ వర్గాలకే అర్థం కాని పరిస్థితి. ఇక మిగిలిన పార్లమెంటు స్థానాలకు ఖరారు చేస్తున్న అభ్యర్థులు కూడా అంత బలమైన వారు కాకపోవటం మరింత ఆశ్చర్యం అని చెప్పాలి.
ఈ లెక్కను చూస్తే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాదులో పోటీ చేసిన చేయకపోయినా ఒకటే.. అది మజిలీస్ కంచుకోట. మిగిలిన 16 పార్లమెంటు స్థానాలలో రెండు బీఎస్పీకి ఇస్తే.. ఇక టిఆర్ఎస్ కేవలం 14 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. ఈ సీట్లకు ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులు కూడా కనీసం ఒక నియోజకవర్గస్థాయి బలం లేని వాళ్లే ఎక్కువ మంది ఉండటం విచిత్రం.