EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్లు తమ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది.
ఏజెంట్లను అభ్యర్ధి సర్టిపై చేయాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుండి డిక్లరేషన్ తీసుకోవాలని ఈసీ స్పష్టత ఇచ్చింది. సహజంగా పోలింగ్ బూత్ లలో అభ్యర్ధుల ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు.
ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతనే వారికి ఓటు వేసే హక్కును పోలింగ్ సిబ్బంది కల్పిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అభ్యర్ధుల తరపున ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. గతంలో పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇచ్చేవారు. వాటిని పోలీస్, రిటర్నింగ్ అధికారి వెరిఫికేషన్ జరిపి ఆమోదం తెలిపేవారు.
దీంతో పోలీస్ కేసులు ఉన్న వారిని పక్కన పెట్టే పరిస్థితి ఉండేది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్లుగా పని చేయవచ్చని పేర్కొంది. ఏజెంట్ల నియామకం విషయంలో పోలీస్ లు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.