Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన స్టార్ లైనర్ వ్యోమనౌకను మోసుకువెళ్లాల్సిన రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తడమే ఇందుకు కారణం.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం వెల్లడించలేదు.
ప్లోరిడాలోని కేప్ కెనావెరాల్ లో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి బింగ్ కు చెందిన అట్లాస్ వీ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లడానికి సిద్దమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్ ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్ లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పని తీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మిషన్ పైలెట్ గా వ్యవహరించాల్సిన సునీతకు ఇది మూడో అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006,2012 లో రోదసీలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈ సారి తన ఆరాధ్యదైవం గణపతి విగ్రహాన్ని వెంట పట్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు. స్టార్ లైనర్ కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉందని అంతకు ముందు వెల్లడించారు. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదని చెప్పారు.
Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్