ఏపీ పాలిటిక్స్లో నయా ట్రెండ్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడం, గెలుపు గుర్రం ఎక్కాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండడంతో కీలకమైన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ -.జనసేన పొత్తు ఒకవైపు, వైసీపీ ఒంటరిగా మరోవైపు.. ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో సభలు, సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ సిద్ధం సభలు పెడుతుండగా.. టీడీపీ ఆధ్వర్యంలో రా.. కదలిరా! సభలు జరుగుతున్నాయి.
ఒకరిపై ఒకరు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అయితే.. మరోవైపు, సినిమాలతోనూ కొట్టేందుకు రెడీ కావడం గమనార్హం. ఇరు పార్టీలకు చెందిన కీలక అంశాలతో షార్ట్ మూవీలను రెడీ చేస్తు న్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ట్రైలర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. టీడీపీ అనుకూల వర్గాల నుంచి ఒక సినిమా ట్రైలర్ బయటకు వచ్చి.. దుమ్ము రేపుతోంది. ఇక, ఇప్పుడు వైసీపీ కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చేసింది.
టీడీపీ అనుకూల వర్గాల నుంచి వచ్చిన సినిమా.. రాజధాని. ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం.. రైతులు తమ భూములు ఇవ్వడం, చంద్రబాబు హయాంలో నిర్మాణాలు జరగడం, నవనగ రాల ఏర్పాటు వంటి కీలక అంశాలను చూపించారు. అయితే.. వైసీపీ అధికారంలోకి రాగానే.. మూడు రాజధానులను తెరమీదికి తెచ్చి.. ఏవిదంగా ఇక్కడి రైతులను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని చూపించారు.
ఈ క్రమంలో పోలీసుల దాడులు, లాఠీ చార్జి వంటి అంశాలను, పాదయాత్రలను కూడా ప్రధానంగా ప్రస్తా వించి.. ఎన్నికల ముందు రాజధాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనికి కౌంటర్గా వైసీపీ కూడా చిత్రాన్ని రూపొందించింది. అమ్మ ఒడి పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి.. ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. దీనిని తమిళ రీమేక్ మూవీకి జోడించి తీశారు. జ్యోతిక నటించిన ఓ సినిమాకు మాటలు మార్చి.. అమ్మ ఒడిని రూపొందించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సినిమాలతో విజృంభించడం చూస్తే..ఎన్నికల జోరు ఎలా ఉంటుందో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు.