టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో అనేక స్థానాల్లో సర్దుబాటు జరుగుతోంది. అదేసమ యంలో కొందరు వైసీపీ నుంచి తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. దీంతో టీడీపీలో ఉన్నవారికి కొంత ఆవేదన.. మరింత బాధ కలుగుతోంది. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కకపోవడమే. తాజాగా తెనాలి, మైలవరం రెండు స్తానాలు కూడా టీడీపీలో చర్చనీయాంశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తెనాలి టికెట్ను దాదాపు జనసేనకు కేటాయించారు.
జనసేన కీలక నాయకుడు.. నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే .. పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న నాటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర పరిస్థితిపై ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు రాజా చాలా కాలంగా పార్టీని నమ్ముకున్నారని, ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచారని .. ఆయన వర్గం చెబుతోంది. ఇక, రాజా విషయానికి వచ్చినా.. నియోజకవర్గంలో మంచి పట్టుంది. స్థానికంగా పేరు కూడా ఉంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఈ సీటును జనసేన కు ఇచ్చేశారంటూ.. వచ్చిన ప్రచారంపై ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి సీటును ఆలపాటి రాజాకే ఇవ్వాలంటూ పట్టుబడుతు న్నారు. ఈ నెల 8 తర్వాత తన నిర్ణయం ఉంటుందని ఆలపాటి ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్న పరిస్థితి. ఇదిలావుంటే.. మరోవైపు.. మైలవరంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడి టికెట్ను ఇంకా కన్ఫర్మ్ చేయకపోవడం.. పైగా వైసీపీ నుంచి ప్రస్తుత నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్.. బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్ననేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
దీంతో మాజీ మంత్రి, మైలవరం నాయకుడు దేవినేని ఉమా వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. ఇక, దేవినేని కూడా బయటపడి పోతున్నారు. పార్టీని కాదనుకుని వెళ్లిపోయిన వారికి ఎలా ప్రాధాన్యం ఇస్తారని .. ఆయన ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోతానే మైలవరం నుంచి పోటీ చేస్తున్నానని కూడా చెప్పారు. ఎవరు వచ్చినప్పటికీ కేడర్ సహించదని.. నాలుగున్నరేళ్లుగా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనది చూడాలి.