కడప, జనవరి 24: కడప జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పీటముడి వీడలేదు. ఈ సీటు కోసం ఇద్దరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆశిస్తున్నారు. ఈ స్థానం ఇద్దరూ తమకే కావాలని పట్టుపట్టడంతో పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది. పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సీటుకూ, మరొకరు కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం. రామసుబ్బారెడ్డి గతంలో మంత్రిగా పని చేశారు. వైసిపి నుండి గెలిచి పార్టీలో చేరిన ఆదినారాయణరెడ్డి నేడు మంత్రిగా ఉన్నారు. తొలి నుండి పార్టీలో ఉన్న రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి 2004,2009,2014 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు రామసుబ్బారెడ్డిపైనే ఆదినారాయణ రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. 2014లో వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి తరువాత టిడిపిలో చేరి మంత్రి పదవి చేపట్టారు. ఈ నియోజకవర్గం దివంగత శివారెడ్డి కాలం నుండి రామసుబ్బారెడ్డి కుటుంబానికి, టిడిపికి కంచుకోటగా ఉండేది. ఈ కారణంగా రామసుబ్బారెడ్డి తనకే అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరో పక్క మంత్రి హోదాలో ఆదినారాయణ రెడ్డి కూడా తనకే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ, మండలి విప్ పదవి ఇచ్చి అధిష్టానం బుజ్జగించినప్పటీకీ ఆయన అసెంబ్లీ సీటుపై పట్టువీడటం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందవచ్చని ఇద్దరు అసెంబ్లీ స్థానాన్నే కోరుతున్నారు.
ఈ సీటుపై బుధవారం ఉదయం చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపినా పరిష్కారం రాలేదు. సాయంత్రం మరో సారి చర్చించేందుకు నిర్ణయించగా సాయంత్రం చర్చలకు రామసుబ్బారెడ్డి గైర్హాజరు అయ్యారు.
ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి అనుచరులు, మద్దతుదారులు ఎమ్మెల్యే పదవిపై పట్టువీడవద్దని చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటు కార్యకర్తలను సముదాయించలేక, అటు పార్టీ అధినేత మాట కాదనలేకపోతున్నారు. ఇద్దరు ఒక అవగాహనకు రాలేకపోవడం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. గురువారం సాయంత్రం చర్చలు ఒక కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు.