ఆస్తులు కాదు ముఖ్యం మానవత్వం ముఖ్యం.. గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటే కాదు మంచి మనసు ఉండాలి.. ఇవన్నీ కలబోసుకున్న నిండైన మనిషి ఇప్పుడు ప్రజల కళ్లకు కనబడుతున్నాడు. అతనే ‘సోనూసూద్’. పరిచయం అక్కర్లేని ఈ సినిమా విలన్ ఇప్పుడు ప్రజల పాలిట హీరో అయ్యాడు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను ఎంత కకావికలం చేస్తుందో చూస్తున్నాం. ఈ సమయంలో అన్నా.. అని ఎవరు పిలిచినా నేనున్నా.. అంటూ ముందుకొచ్చి సాయం చేస్తున్నాడు.
ఒడిశా కూలీలకు మహారాష్ట్ర నుంచి విమానం ఏర్పాటు చేశాడు. రీసెంట్ గా మదనపల్లిలో ఇబ్బందుల్లో ఉన్న రైతుకు ట్రాక్టర్ అందజేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దేశంలో సోనూసూద్ దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఏ సమస్య ఆయనకు విన్నవించుకున్నా స్పందిస్తున్నాడు. దీంతో అసలు సోనూసూద్ ఆదాయమెంత..? అనే చర్చ అటు మీడియాలో, సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు. దీనికి కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు చెప్తున్న కథనాలు ఇలా ఉన్నాయి.
సోనూసూద్ కు మొత్తంగా 125 నుంచి 140 కోట్ల ఆస్తి ఉంది. ముంబైలో కొన్ని విలాసవంతమైన హోటల్స్ ఉన్నాయి. పెద్ద బంగళా కూడా ఉంది. ఈ మూడు నెలల కరోనా సమయంలో సోనూసూద్ అనేక రకాలుగా సాయం చేశాడు. సేవ, దాతృత్వం, సాయం రూపంలో ఇప్పటికి 10కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్తి ఎంత ఉన్నా సాయం చేయాలనే తపన ఉంటేనే ఇది సాధ్యం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు సోనూసూద్.