లక్నో(ఉత్తర్ప్రదేశ్), జనవరి 31: బిఎస్పి నేత మాయావతి హయాంలో స్మారకాల నిర్మాణాలకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్లోని ఏడు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు చేపట్టింది.
గతంలో మాయవతి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, లక్నో, నోయిడా, ఇతర ప్రాంతాల్లో 2,600 కోట్ల రూపాయల వ్యయంతో కాన్షిరాం విగ్రహాలు, బహుజన్ సమాజ్ పార్టీ చిహ్నాలు, పార్కులను నిర్మించారు.
2014లో రాష్ట్ర విజిలెన్స్ విభాగం నిర్వహించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈడి రంగంలోకి దిగింది. ఈ నివేదికలో ప్రభుత్వానికి 111.44 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందనీ, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చారనీ పేర్కొన్నారు.
మరోపక్క అక్రమ మైనింగ్ కేసులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్పై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది.
రానున్న ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు మాయావతి, అఖిలేష్ యాదవ్లు ఈనెల 12న పొత్తు ప్రకటించారు.