సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది చివరిలో తన కొత్త పార్టీ పేరు మరియు సిద్ధాంతాలు తెలియజేస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ ప్రకటనతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అని అందరూ భావించారు. అంత మాత్రమే కాక ఎంజీఆర్ తరహాలో తమిళనాడు రాజకీయాలలో రజినీకాంత్ చరిత్ర సృష్టిస్తారని కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని రజనీ సన్నిహితులు మాత్రమే కాక తమిళనాడులోని అభిమానులు కూడా డిసైడ్ అయ్యారు.
ఇటువంటి తరుణంలో సరిగ్గా ఇంకా నాలుగు రోజులలో కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన విధి విధానాలు రజిని ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన కు అస్వస్థత కలగటం హైదరాబాద్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్లో జాయిన్ అవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత సడన్ గా తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఇది దేవుని నిర్ణయము అంటూ రజినీకాంత్ మూడు పేజీల ప్రకటన విడుదల చేయటం అభిమానులను ఒక్కసారిగా నిరుత్సాహ పరిచింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్న కమలహాసన్..రజనీ ప్రకటన పట్ల స్పందించారు. రజిని తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని పేర్కొన్నారు. కానీ రజనీకాంత్ ఆరోగ్యమే తనకి ముఖ్యమని కమల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో హడావిడిగా ఉన్నా టైం తీసుకుని రజినీకాంత్ ని కలుస్తాను అంటూ కమల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే పార్టీ పెడితే కచ్చితంగా ఆయన సిద్ధాంతాలు బాగుంటే పొత్తుపెట్టుకుని పోటీ చేయాలని కమలహాసన్ అప్పట్లో కామెంట్లు చేయడం జరిగింది. కానీ రజనీకాంత్ ఒక్కసారిగా నిర్ణయం మార్చుకోవడంతో కమల్ నిరాశ చెందినట్లు సమాచారం.