Etela Jamuna: భూకబ్జా ఆరోపణలో ఈటెల రాజేందర్ ను కేసిఆర్ సర్కార్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. భూములపై విచారణ జరుగుతోంది. ఒక పక్క ఈటెల తన రాజకీయ భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో నేడు ఈటల రాజేందర్ సతీమణి జమున నేడు మీడియా ముందుకు వచ్చి కేసిఆర్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతటి నిర్బంధం లేదని అన్నారు. తమ ఇంటి చుట్టూ పోలీసులే ఉన్నారనీ, ఎవరిని భయపెట్టడానికి అని ప్రశ్నించారు. తమ హెచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలను తిప్పి కొట్టడం తమకు తెలుసునని అన్నారు. తాము ఎవరినీ మోసం చేయలేదనీ, కష్టపడి పైకి వచ్చామని అన్నారు. ప్రణాళిక ప్రకారం పోలీసులతో భయభ్రాంతులకు గురి చేశారని జమున ఆరోపించారు.
1992లో దేవరయాంజల్ కు వచ్చిన తాము 1994లో 46 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. తమ గోదాములను ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తాము ఎవరికీ అన్యాయం చేయలేదు, దోపిడీ చేయలేదన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుందని పేర్కొన్నారు.
Read More: Anandaiah Medicine: ఆనందయ్య మందు పంపిణీపై ఆయుష్ కమిషనర్ ఏమన్నారంటే…!?
సమైక్య పాలనలో కులాలు చూడలేదు. కానీ ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారని అన్నారు. అన్ని కులాలు ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాతే అవమానాలు పెరిగాయన్నారు. తమ పౌల్ట్రీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశామని అన్నారు. తమ భూములు సర్వే చేయడాన్ని తాము అభ్యంతరం చెప్పడం లేదనీ, తమ సమక్షంలోనే సర్వే చేయాలని కోరుతున్నామన్నారు.