CM YS Jagan: జగనన్న విద్యా దీవెన పథకం ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి 10.82 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు విడుదల చేశారు. అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసికానికి గానూ ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను బుధవారం సచివాలయంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొట్టి నేరుగా జమ చేశారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకూ ప్రభుత్వం రూ.9,274 కోట్లు పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించింది.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు వారి కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుండటం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని అన్నారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. ఎవరూ దొంగిలించలేని ఆస్తి ..చదువు అని జగన్ అన్నారు. ఈ పథకానికి లిమిట్ అంటూ ఏమి లేదనీ, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది ఈ స్కీమ్ కింద చదువుకోవచ్చని తెలిపారు. తాను పాదయాత్రలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన తనకు ఈ పథకం ఆవిశ్యకతను గుర్తు చేసిందన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో పేద విద్యార్ధులు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.