నిజంగానే చంద్రబాబు గోదావరి జిల్లాల్లో కమ్మోళ్లని ముంచేశారనే చెప్పాలి. ఆ మాటకు వస్తే గోదావరిలో కమ్మోళ్లనే కాదు.. కృష్నాతో పాటు గుంటూరు జిల్లాలో కమ్మోళ్లని కూడా ముంచేస్తోన్న పరిస్థితే ప్రస్తుతం టీడీపీలో కనిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కమ్మ నేతలను బాగా వాడుకునే చంద్రబాబు తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆయనపై ఎప్పటి నుంచో సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. పార్టీ 2019లో ఓడిపోయాక ఏ స్థాయికి దిగజారిపోయిందో చూశాం. ఆ టైంలో పార్టీ కోసం ఎంతో కష్టపడిన నేతలను ఇప్పటి ఎన్నికల వేళ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది.
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత గోదావరి కమ్మ నేతలను ప్రస్తావిస్తే దెందులూరులో మాజీ విప్, ఫైర్బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి ప్రభాకర్ పేరు ఫస్ట్ లిస్టులో లేదు. సరికదా.. ఆయన కుమార్తె చింతమనేని నవ్య పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ రన్ చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్లోనే తీవ్ర అసంతృప్తి వస్తోంది. చింతమనేని లాంటి ఫైర్బ్రాండ్ పేరు రాష్ట్ర టీడీపీ కేడర్కే ఓ ఉత్తజం లాంటిది. ప్రభాకర్ పేరును ఫస్ట్ లిస్టులో పక్కన పెట్టడం ఎవ్వరికి నచ్చడం లేదు.
ఇక మరో కమ్మ నేత ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పార్టీ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఏలూరు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ఓ గాడిలో పెట్టారు. ఆయన పార్లమెంటు పగ్గాలు చేపట్టాకే చింతలపూడి, పోలవరం, నూజివీడు లాంటి చోట్ల పార్టీ ఓ గాడిన పడింది. ఇప్పుడు ఆయనకు ఫస్ట్ లిస్టులో చోటు లేదు సరికదా.. ఈ సీటు జనసేనకు ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారం పార్టీ కేడర్ను డల్ చేసేసింది.
ఉమ్మడి జిల్లాలో మరో కమ్మ నేత, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుది అదే డైలమా. ఈ సీటు జనసేనకు ఇస్తారని టాక్ ? అదే జరిగితే రెండుసార్లు గెలిచిన శేషారావు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిపోయినట్టే. ఇక రాజమండ్రి రూరల్ నుంచి వరుసగా రెండు సార్లు గెలవడంతో పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంతో ఫైట్ చేసిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు విషయంలో ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకే ఎంతో పోరాటం చేయాల్సి వస్తోంది.
ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి మాజీ జడ్పీ చైర్మన్గా ఒక వెలుగు వెలిగిన ముళ్లపూడి బాపిరాజు సైతం తన రాజకీయ అస్తిత్వం కోసం నానా తంటాలు పడుతున్నారు. పెద్దాపురంలో పార్టీ కోసం ఎంతో కష్టపడిన గుణ్ణం చంద్రమౌళికి సీటు లేదు. ఇక పెద్దాపురం సీటు కోసం విశ్వప్రయత్నాలు చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజానగరం ఇన్చార్జ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇవ్వడంతో ఆయనకు అక్కడ సీటు లేదు. కనీసం ఆయనకు రాజమండ్రి ఎంపీ సీటు అయినా వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఏలూరు పార్లమెంటు సీటు అడుగుతున్న సీనియర్ నేత మాగంటి బాబు గోడు ఆలకించే వారే లేరు.
ఇక గోదావరి జిల్లాల్లోనే కాదు కృష్ణాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ కోసం ఎంతో చేశారు. ఆయనకు మైలవరం సీటే కాదు.. అసలు జిల్లాలో ఎక్కడైనా సీటు వస్తుందా ? అన్న సందేహం ఉంది. ఇక గుంటూరులో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా తెనాలిలో నాదెండ్ల మనోహర్ కోసం తన సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి. గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీథర్ లాంటి ఉద్దండులకే ఫస్ట్ లిస్టులో సీటు లేదు. రాయపాటి వాళ్లను బాబు ఎప్పుడో పక్కన పెట్టేశారు.
ఇక రాయలసీమలో కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో ఓడి ఐదేళ్ల పాటు పార్టీని నడిపించుకుంటూ వస్తోన్న మాదినేని ఉమామహేశ్వరనాయుడును పక్కన పెట్టిన బాబు అమిలినేని సురేంద్రబాబుకు సీటు ఇచ్చేశారు. చంద్రగిరిలో పులివర్తి నానికి సైతం సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఏదేమైనా చాలా మంది కమ్మ నేతలు అసలు కమ్మ పుటక పుట్టి టీడీపీలో ఉండడం వేస్ట్ అని.. పార్టీ మీద అభిమానం చంపుకోలేక పడుతోన్న బాధల గురించి చర్చించుకుంటోన్న పరిస్థితి.