ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పలువురు నేతల పార్టీ మార్పులలో వేగం పెరిగింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టిడిపిలో చేరిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు తాజాగా తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించలేదు. గత ఎన్నికలలోనే చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. రాధా తాజా ఎన్నికల్లో ఆయన విజయవాడ సెంట్రల్ సీటు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సీటును చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావుకు కేటాయించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ నుంచి వంగవీటి రాధాకు ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.
వంగవీటి రాధాకు సన్నిహితంగా ఉన్న గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఇద్దరు గత నాలుగు ఐదు రోజులుగా రాధాతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే రాధా పార్టీలోకి వస్తే ఆయనకు మచిలీపట్నం ఎంపీ టిక్కట్టు ఇచ్చేలా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో రాధా వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అయితే జగన్ సెంట్రల్ సీటు రాధాకు ఇవ్వటం కుదరదు అని.. దానిని మల్లాది విష్ణుకు కేటాయిస్తున్నాను అని చెప్పారు. అందుకు బదులుగా రాధాకు విజయవాడ తూర్పు లేదా అవనిగడ్డ లేదా బందరు పార్లమెంటు ఆప్షన్ గా ఇస్తున్నామని.. ఈ మూడు నియోజకవర్గాలలో ఎక్కడ ఒక చోట నుంచి పోటీ చేయాలని కోరినా రాధా జగన్ పై విమర్శలు చేసి బయటకు వచ్చారు.
ఇక ఇప్పుడు తనకు సన్నిహితులుగా ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నాని రాధాతో చర్చలు జరపడంతో పాటు ఆయనను వైసీపీలోకి తీసుకువచ్చి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించేలా ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. జగన్ దూతలుగానే తాము రాధా దగ్గరకు వెళ్లినట్టు కూడా చెప్పినట్టు సమాచారం. అయితే టిడిపి – జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నంలో వైసిపి నుంచి ఎంపీగా విజయం సాధించడం అంత సులువు కాదు.. రాధా ఎంపీగా పోటీ చేస్తే గన్నవరం, గుడివాడలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లతో తమకు లబ్ధి చేకూరుతుందని వంశీ.. నాని భావిస్తున్నారని తమ గెలుపు కోసం రాధాను ఈ ఇద్దరు నేతలు పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక టీడీపీలో సెంట్రల్ సీటు రాకపోవడంతో సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా, వంగవీటి రాధా మధ్య సోషల్ మీడియాలో పెద్దవార్ జరుగుతుంది. రాధాకు తాను అడిగిన సెంట్రల్ సీటు లేదు.. అటు తాను గతంలో పోటీ చేసిన తూర్పు సీటు కూడా లేదు. దీంతో టీడీపీలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సులు లేవు. అందుకే వైసీపీ వైపు చూడాలా ? వద్దా అన్న డైలమాలో అయితే ఉన్నట్టు కృష్నా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.