ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పలు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తలను నియమించడం వారం పది రోజులు తిరగకుండానే వారిని మార్చేసి వారి స్థానాలలో కొత్త సమన్వయకర్తలను ఎంపిక చేయటం జరుగుతూ వస్తోంది. ఎన్నికలకు గట్టిగా రెండు నెలలు కూడా సమయం లేదు.. అయినా ఇష్టం వచ్చినట్టు మార్పులు.. చేర్పులు చేసుకుంటూ వెళుతున్నారు. కొన్నిచోట్ల సమన్వయకర్తలు ఇంకా ప్రచారం కూడా ప్రారంభించకపోవడం ఆయా నియోజకవర్గాలలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు కారణం అవుతుంది.
ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన విశాఖ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మీని నెల రోజుల క్రిందటే జగన్ నియమించారు. ఆమె గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమెను విశాఖ ఇన్చార్జిగా నియమించిన ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఝాన్సీ ప్రచారం ప్రారంభించకపోవడంతో విశాఖ జిల్లాలో పార్టీ నేతలు.. కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. 2019 ఎన్నికలలో విశాఖ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ ను అధిష్టానం విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిర్ణయించింది.
తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న అక్రమాని విజయనిర్మలను తొలగించి ఎంవీవీని ఆరు నెలల కిందట సమన్వయకర్తగా నియమించింది. దీంతో విశాఖ ఎంపీ అభ్యర్థి కోసం జగన్ ఎంతో అన్వేషణ చేశారు. స్థానికంగా అంత బలమైన అభ్యర్థులు ఎవరు కనిపించకపోవడంతో పొరుగు జిల్లా విజయనగరం నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీని విశాఖపట్నం దిగుమతి చేశారు. వచ్చే ఎన్నికలలో ఆమె ఎంపీగా పోటీ చేయటం ఖాయమని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు ఆమె ప్రజల్లోకి రాలేదు.. కనీసం విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులను కూడా కలిసే ప్రయత్నం చేయడం లేదు. పాండురంగాపురంలో ఉన్న బొత్స ఝాన్సీ ఇంటికి కొందరు నేతలు మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసి వస్తున్నారు తప్ప ఇప్పటివరకు నగరంలో ఆమె ఒక కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు.
సాధారణంగా నగరానికి కొత్త వ్యక్తిని ఇన్చార్జిగా నియమిస్తే వాళ్లు త్వరగా ప్రజల్లోకి వెళ్లి పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.. కానీ సీనియర్ రాజకీయ నాయకుడు.. మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గాని.. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఝాన్సీ లక్ష్మి గాని ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మరోవైపు ఝాన్సీ ఎప్పటినుంచి ప్రచారం ప్రారంభిస్తారు అని మంత్రి బొత్సను అడిగితే తొందర ఎందుకు ? మీరు ఎప్పుడు అంటే అప్పుడు అని సమాధానం చెప్పి దాటవేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే గత ఎన్నికల్లోను అంతటి వైసిపి ప్రభంజనంలోనూ విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు జనసేన – టీడీపీ పొత్తు కూడా ఉంది. పరిస్థితి మరింత ఘోరంగా ఉందని.. వైసీపీకి పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదని బొత్స చేయించుకున్న సర్వేలలో కూడా వెల్లడైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా తన భార్యను పోటీకి దింపడంపై బొత్స డైలమాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఎన్నికలకు కాస్త ముందుగా అయినా ఝాన్సీ విశాఖ ఎంపీ రేసు నుంచి తప్పుకోవడం ఖాయమని అంటున్నారు.