వచ్చే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చే క్రమంలో వైసీపీ అధినేత జగన్ ప్రతి సీటు గెలవడమే లక్ష్యంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రకరకాల సర్వే నివేదికలు దగ్గర పెట్టుకుని అనేక వడపోతల అనంతరం అభ్యర్థులను జగన్ ఎంపిక చేస్తున్నారు. ఇతర పార్టీలో టిక్కెట్లు దక్కకుండా మంచి ప్రజాదరణ ఉన్న నేతలపై సైతం వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఓడించేందుకు జగన్ అదిరిపోయే స్కెచ్ గీశారు.
ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాద్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున భూమా అఖిలప్రియ పోటీలో ఉన్నారు. తన తల్లిదండ్రులు శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయిన అఖిల 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద పెదవులు రావడంతో అఖిల ప్రియ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీనికి తోడు ఆమె భర్త భార్గవ్ రామ్ వ్యవహారాలు కూడా ఆమెను రాజకీయంగా పతన స్థాయికి చేర్చేసాయి. అందుకే గత ఎన్నికలలో ఆమె ఏకంగా 35,000 పై చిలుకు మెజార్టీతో బ్రిజేంద్ర చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలో అఖిల పొలిటికల్ కెరీర్ కు ఒక సవాల్.
అసలు ఈసారి ఆమెకు టికెట్ వస్తుందా రాదా ? అన్న సందేహం మధ్య చంద్రబాబు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓడితే అఖిలప్రియ రాజకీయ జీవితం ముగిసినట్టే. దీంతో ఎన్నికల్లో ఆమెను ఓడించాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇక ఆళ్లగడ్డ నుంచి బిజెపి తరఫున పొత్తులో భాగంగా అఖిలప్రియ పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి పోటీ చేయాలని అనుకున్నారు. నాలుగేళ్లుగా ఆయన నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరిగితే ప్రజల్లో మంచి పలుకుబడి తెచ్చుకున్నారు. బిజెపి కాకుండా ప్రధాన పార్టీ టికెట్ వస్తే చాలు గెలుస్తారు అనంత మంచి పేరు కిషోర్ రెడ్డికి వచ్చింది.
అయితే ఇప్పుడు టిడిపి నుంచి అఖిలప్రియకు టికెట్ ఇవ్వడంతో కిషోర్ వ్యూహం మార్చారు. ఇక ఈ టైంలో కిషోర్ రెడ్డి మద్దతు ఉంటే మరోసారి ఆళ్లగడ్డలో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించవచ్చు అన్న అంచనాలతో ఉంది. ఈ క్రమంలోనే జగన్ సూచనల మేరకు రెండు రోజుల క్రితం విజయవాడలో వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి… ఇతర వైసీపీ పెద్దలు కిషోర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరి బ్రిజేంద్ర గెలుపుకు కృషి చేయాలని ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా దాని స్థాయికి సమానమైన పదవి ఇస్తామని కిషోర్ రెడ్డికి వైసిపి పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే 2029లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడే కొత్త అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.