Supreme Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. శివశంకర్ రెడ్డికి గత నెల 11న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణలో భాగంగా సుప్రీం కోర్టు శివశంకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సమాధానం చెప్పాలని కోరింది. జూలై 22 నుండి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఏ 5 గా ఉన్నారు. ఆయనతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ సీబీఐని కూడా సునీత చేర్చారు.
వాదనల సమయంలో విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. చార్జెస్ ఫ్రేమ్ చేసే దశలోనే ఉన్నట్లు సునీత తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. ప్రతి దశలోనూ ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్ పొందారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ 1 కు గతంలో బెయిల్ రాగా.. సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ఈ నెల మూడో వారంలో ఇదే ధర్మాసనం ముందుకు వస్తుందని చెప్పారు. ఏ 8 మాత్రం ముందస్తు బెయిల్ పై ఉన్నారని, దీనిపై ఇప్పటికే సవాల్ చేసినట్లు తెలిపారు.
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి గత నెల 11న బెయిల్ మంజూరు అయ్యింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హజరుకావాలని తెలిపింది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది. వీటితో పాటు దేవిరెడ్డి పాస్ పోర్టు సరెండర్ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: యూట్యూబర్ అరెస్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు