అమరావతి: ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అధికారపక్లంలో అసహనం బాగా పెరిగిపోతోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. ముగ్గురు టిడిపి సభ్యులను శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి మంగళవారం సస్పెండ్ చేసిన అనంతరం సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ చంద్రబాబుతో సహా టిడిపి సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాము ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కత్తులు, కటార్లతో వెళ్లట్లేదని అన్నారు. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అధికార పక్షం అసహనం వ్యక్తం చేస్తున్నదని చంద్రబాబు విమర్శించారు.
వైసిపి పాలనలో రాష్ట్రంలో అలజడి మెదలయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారాలపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోందనీ, పులివెందుల తరహా పాలనపై ప్రజల్లో భయం మొదలయ్యిందని చంద్రబాబు ఆరోపించారు. తమపై బురద చల్లే ప్రయత్నంలో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
బిసి నాయకుడిని సభ నుండి సస్పెండ్ చేసి బిసి బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఏ విధంగా చూడాలని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పక్ష ముందస్తు వ్యూహంలో భాగంగానే సస్పెండ్ చేసినట్లు అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. టిడిపి ఉప నాయకుడిని అకారణంగా సస్పెండ్ చేస్తే తామెలా ఖాళీగా కూర్చుంటామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై టిడిఎల్పిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.