ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ సీటు టీడీపీ టిక్కెట్పై సస్పెన్స్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీ క్యాండెట్గా కంభం విజయరాజు పేరు ఖరారు కాగా.. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆరేడు నెలలుగా నాన్చుతూ వస్తోన్న టీడీపీ క్యాండెట్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. చింతలపూడి టీడీపీ టిక్కెట్ ప్రధానంగా ముగ్గురు పేర్ల మధ్యే దోబూచులాడుతోంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పార్టీ సీనియర్ నేత, మహేంద్రా ట్రాక్టర్షోరూం డీలర్ ఆకుమర్తి రామారావుతో పాటు లింగపాలెం మండలానికి చెందిన ఎన్నారై సొంగా రోషన్ కుమార్, మాజీ ఐఏఎస్ బి. దానం కుమారుడు బొమ్మాజి అనిల్ టిక్కెట్ రేసులో ఉన్నారు.
వీరిలో ఆకుమర్తి, రోషన్ లోకల్ కాగా, అనిల్ నియోజకవర్గానికి నాన్లోకల్. ఆకుమర్తి, రోషన్ మాదిగ వర్గం నేతలు కాగా, అనిల్ మాల వర్గం నేత. ఈ ముగ్గురిలో ఎవరి ప్లస్లు వారికి ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో గోపాలపురం, కొవ్వూరు సీట్లు మాదిగ వర్గంకు ఇచ్చిన నేపథ్యంలో చింతలపూడి మాలలకు ఇవ్వాలంటే అనిల్ ఒక్కరే బలమైన ఆప్షన్. ఆర్థిక బలంలో మిగిలిన ఇద్దరు నేతల కంటే కూడా ఓ మెట్టు పైన ఉండడం ప్లస్. అటు తన్న అన్న విజయ్కుమార్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్చార్జ్గా ఉండడం, పార్టీలో కీలక పరిచయాలు వాడుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ఇక లింగపాలెం మండలానికి చెందిన రోషన్కు నియోజకవర్గానికే చెందిన కొందరు నేతల సపోర్ట్ ఉంది.
గత ఎన్నికల్లో సీటు కోసం ట్రై చేసి రాకపోయాక మధ్యలో పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉన్న రోషన్ ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందు నుంచే మళ్లీ యాక్టివ్ అయ్యారు. రోషన్ మాదిగ కోటాలో స్థానిక నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు పై స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.
నియోజకవర్గానికి గుండెకాయలాంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకే చెందిన ఆకుమర్తి రామారావు గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ సీటు కోసం ట్రై చేశారు. మాదిగ వర్గానికి చెందిన నేత, సౌమ్యుడు, నియోజకవర్గంలో రైతులతో పార్టీలకు అతీతంగా విస్తృతంగా ఉన్న పరిచయాలు, నారా లోకేష్ సేవాసమితి ద్వారా గత 10 ఏళ్లకు పైగా చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ రామారావు ప్లస్లు. రామారావు రేసులో ఉంటే స్థానికంగా ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్న పేరు, రైతల నుంచి చాలా సానుకూలత కనిపిస్తోంది.
విజయరాజు ఎంట్రీతో మారిన సీన్… ఐవీఆర్ఎస్ ఆకుమర్తి ముందంజ…
ఈ ముగ్గురిలో ఆర్థిక బలాలు, సామాజిక బలాలు బేరీజు వేసుకుని ఓ నేతకు టిక్కెట్ దాదాపు ఖరారు చేశారన్న ప్రచారం కొద్ది రోజుల ముందు వరకు జరిగింది. వైసీపీ నుంచి స్థానికుడు, బ్రేక్ ఇన్స్పెక్టర్గా లోకల్గా పరిచయాలున్న కంభం విజయరాజు పేరు ఖరారు కావడంతో టీడీపీ అధిష్టానం సైతం పునరాలోచన పడి ఐవీఆర్ఎస్ సర్వే ప్రారంభించింది. ఈ సర్వేలో ఆకుమర్తి ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఇతర పార్టీలకు చెందిన వారికి సైతం ఈ కాల్స్ వెళ్లగా వారు కూడా స్థానికత, సౌమ్యడున్న కోణంలో రామారావుకే ఓట్లు వేస్తున్నారు. దీంతో చింతలపూడి టీడీపీ టిక్కెట్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఈ నెల 5న చంద్రబాబు చింతలపూడి పర్యటన తర్వాత దీనిపై ఓ కొలిక్కి వచ్చేస్తుందంటున్నారు.