Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, సీపీఐ, సీపీయం జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా లు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలు, ల్యాండ్, శ్యాండ్, భూకబ్జాలు గత అయిదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీకి కనిపించలేదని విమర్శించారు. బిజెపితో అంటకాగుతున్న వైసీపీకి మోడీ కొమ్ముకాసారని, ఇప్పుడు అవినీతని గగ్గోలు పెడుతుడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
మే నెల 11వ తేదీ (శనివారం) కడప సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో వారి కుటుంబానికి న్యాయం జరగాలని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలా రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా 10వ తేదీన జరిగే ఇండియా కూటమి ఎన్నికల సభ కరపత్రాన్ని మాణిక్కం ఠాగూర్ విడుదల చేశారు.