అమరావతి: హైదరాబాద్లోని స్వగృహంలో ఊరివేసుకుని మరణించిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు శివరామకృష్ణ కెన్యా రాజధాని నైరోబి నగరంలో ఉన్నారు. తండ్రి మరణ వార్త తెలియగానే ఆయన ఇండియాకు బయలుదేరారు. రేపు ఉదయానికల్లా శివరామ్ చేరుకోగలరని భావిస్తున్నారు.
కోడెల అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన స్వగ్రామం నకిరేకల్లు మండలంలోని కండ్లకుంట. అక్కడ ఆయన ఇల్లు ఇంకా ఉంది. అయితే వైద్యుడిగా నర్సరావుపేటలో ప్రాక్టీసు ప్రారంభించిన తర్వాత అక్కడే స్థిరపడ్డారు.
2006లో ఆయన చిన్నకుమారుడు సత్యనారాయణ కారు ప్రమాదంలో మరణించారు. కుమారుడి జ్ఞాపకంగా నర్సరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే దారిలో ఒక శ్మృతివనం నెలకొల్పారు.
ఈ మూడు చోట్లలో కోడెల అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించేదీ ఇంకా స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కోడెల భౌతికకాయాన్ని ముందు హైదరాబాద్లోని ఎన్టిఆర్ భవన్కు తీసుకువెళ్లాల్సిందిగా టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశించారు.