(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజకీయ జీవితంలో కోడెల శివప్రసాదరావు రకరకాల వివాదాలు ఎదుర్కొన్నారు. ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నారు. ఉక్క ముక్కలు తిన్న నేతగా ఎదిగారు. వ్యక్తిగత జీవితంలో ఎదురయిన సంక్షోభాలు మాత్రం ఆయనను కుంగదీశాయి. 13 ఏళ్ల క్రితం కోడెల చిన్న కుమారుడు డాక్టర్ సత్యనారాయణ ప్రమాదవశాత్తు మరణించారు. ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్న సత్యనారాయణ కారు స్వయంగా నడుపుకుంటూ హైదరాబాద్ వస్తూ 2006 ఏప్రిల్ 16న రామగుండం వద్ద ప్రమాదానికి గురయ్యాడు.
సత్యనారాయణ మృధు స్వభావి. మంచి వాడిగా బంధు మిత్రులలో పేరు సంపాదించుకున్న వ్యక్తి. అతను చిన్న వయసులోనే హఠాత్తుగా దుర్మణం పాలవడం కోడెలను కుంగదీసింది. అది ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురయిన మొదటి సంక్షోభం. చిన్న కుమారుడిని కోల్పోయిన వేదన నుండి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది.
ఒక కుమారుడు లేకుండా పోయాడన్న బాధ కారణంగానే కోడెల తన పెద్ద కుమారుడు శివరామ కృష్ణ విషయంలోచూసీచూడనట్లు వ్యవహరించారని అంటారు. 2014లో కోడెల సత్తెనపల్లి నియోజకవర్గం నుండి గెలిచి స్వీకర్ స్థానాన్ని అధిష్టించిన తర్వాత శివరాం ఆ నియోజకవర్గం పరిధిలో రకరకాల అక్రమాలకు పాల్పడ్డారన్న అబియోగాలు ఉన్నాయి. ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా నర్సరావుపేట నియోజకవర్గం పరిధిలో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆభియోగాలు వచ్చాయి.
కుమారుడు, కుమార్తెను అదుపు చేసే విషయంలో కోడెల ఖరాఖండీగా వ్యవహరించలేకపోయారు. ఫలితంగా ఆ రెండు నియోజకవర్గాల పరిధిలో అటు టిడిపికి ఇటు కోడెల కుటుంబానికీ చెడ్డపేరు వచ్చింది. ఇది కోడెల వ్యక్తిగత జీవితంలో రెండవ సంక్షోభం, 2019 ఎన్నికల్లో టిడిపి పరాజయం, వైసిపి ఘన విజయం ఈ వ్యక్తిగత జీవిత సంక్షోభాన్ని రాజకీయ సంక్షోభంగా మార్చాయి.
అధికార పీఠంపైకి వైసిపి రాక కోడెల కుటుంబ సభ్యుల బాధితులకు ధైర్యాన్ని ఇచ్చింది. దానికి స్థానిక వైసిపి నాయకులు అండదండలు తోడయ్యాయి. వరసగా ఆరోపణలు రావడం మెదలయింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు దాఖలయ్యాయి. కె ట్యాక్స్ అంటూ వైసిపి నేతలు మీడియాలో విమర్శలు గుప్పించారు. సత్తెనపల్లిలో కోడెల కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ప్రతి రోజు నిరసనలు నిర్వహింపజేశారు. ఒక దశలో కోడెల మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పక్షాన్ని ఉద్దేశించి నన్ను వేధించకండి అని చెప్పారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వివాదం ఆయనకు తీవ్ర మానసిక వత్తిడికి గురి చేసింది. ఈ రెండవ సంక్షోభాన్ని ఆయన అధిగమించలేకపోయారు. నిశ్శబ్దంగా నిష్క్రమించారు.