పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై ఒక పార్టీ తరపున ఒక కూటమి తరపున ప్రచారం చేయడం సాధ్యం అవుతుందా..? ఈ ఇద్దరు ఒకే పొలిటికల్ ఎజెండాతో కలిసి పని చేయడం సాధ్యం అవుతుందా..? ఆ అవకాశాలు ఉన్నాయా ..? లేదా.. అది సాధ్యం అవుతుందా..? కాదా అనే ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తే.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి. కశ్చితంగా ఈ భేటీకి పొలిటికల్ అజండా అయితే ఉంటుంది. ఇదే అమిత్ షా గతంలో పవన్ కళ్యాణ్ ను కలిసారు. పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారు. అదే విధంగా జనసేన, బీజేపీ మద్య పొత్తు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కఛ్చితంగా పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీ కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ చరిష్మాను ఎంతో కొంత వాడుకునేందుకు వాళ్లు అడిగిన సీట్లు ఇచ్చి పొత్తు కొనసాగించాలన్న ఆలోచనలో ఉంది.
టీడీపీతో పొత్తు బీజేపీకి అదనపు బలం
అదే విధంగా తెలంగాణలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఓటు బ్యాంక్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తొంది బీజేపీ. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో 12 నుండి 15 నియోజకవర్గాల్లో బీజేపీకి అదనపు బలం తోడవుతుంది అని చెప్పవచ్చు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు. తెలంగాణలో టీడీపీని లీడ్ చేయడం గానీ, లేక బీజేపీ తరపున ప్రచారం చేయడం గానీ ఈ రెండు అంశాల్లో ఏదో ఒక దానిపై చర్చ జరిగి ఉంటుంది. బీజేపీ ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ తో మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకోవాలని చూస్తొంది. పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు దాదాపు 99 శాతం ఖాయమే.
జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటే..?
అయితే జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎన్నికల నుండే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా ..? లేక బీజేపీతో ప్రచారం చేస్తారా.. ?లేదా తెలంగాణలో టీడీపీ బాద్యతలు తీసుకుంటారా..? తనకు ఇప్పట్లో రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు తరువాత చూస్తానని చెబుతారా..? అనేది ఆసక్తికరమైన అంశం. కానీ బీజేపీ మాత్రం వదిలిపెట్టదు. తమిళనాడులో రజనీకాంత్ వెంటపడుతోంది. ఏపిలో పవన్ కళ్యాణ్ ను కలుపుకుని పోతుంది. తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ ను కలుపుకుని పోతుంది. అలానే జూనియర్ ఎన్టీఆర్ ను కలుపుకునే ప్రయత్నాలు చేస్తొంది. యువ హీరో నితిన్ తండ్రికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఆయనతో ప్రచారం చేయించుకోవాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. సినీ చరిష్మాను పొలిటికల్ కు వాడుకోవాలని బీజేపీ చూస్తొందనే మాట వాస్తవం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటే తెలంగాణలో రాబోయే ఆరు నెలల్లో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మోడీ, అమిత్ షాలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇవన్నీ అసాధ్యమని చెప్పడానికి వీలులేదు. ఇలా జరుగుతుందో లేదో వేచి చూద్దాం..!