ఏపీలో వైసీపీని గద్దె దించేయడమే ధ్యేయంగా చేతులు కలిపిన బీజేపీ-జనసేన-టీడీపీల్లో సఖ్యత మాట ఎలా ఉన్నా.. నాయకులు, పార్టీల మధ్య మాత్రం మనసులు కలుసుకున్నట్టు కనిపించడం లేదు. తొలి నాళ్లలో టికెట్ల విషయంలో పోరు సాగింది. కనీసం టీడీపీ కి చెప్పకుండానే.. బీజేపీ కొన్ని కొన్ని స్థానాల్లో టికెట్లు ప్రకటించుకుంది. అభ్యర్థులను కూడా ఖరారు చేసుకుంది. దీంతో విధిలేని పరిస్థితిలో టీడీపీ అక్కడ అభ్యర్థులను మార్చి.. వేరే స్థానాలకు బదిలీ చేసుకుంది.
తర్వాత.. ప్రచారం విషయంలోనూ.. బీజేపీ ఎడమొహం పెడమొహంగానే ఉంది. కేవలం బీజేపీ పోటీ చేస్తున్న 10 స్థానాల్లోనే ప్రచారం చేసేందుకు అగ్రనేతలు పచ్చ జెండా ఊపడంతో నాయకులు ఆయా స్థానాల్లోనే ప్రచారం చేస్తున్నారు. ఇలా.. టికెట్లు ప్రచారంలో మతలబు పెట్టిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా.. మేనిఫెస్టోపైనా తన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే ఒక మేనిఫెస్టోను ప్రకటించింది.
దీనినే ఏపీలోనూ ప్రవేశ పెట్టాలని.. బీజేపీ అగ్రనేతలు తేల్చిచెబుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ పేరుతో ప్రత్యేకంగా ఉచిత పథకాలను ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన దాదాపు ఈ పథకాలే తనకు అధికారం తెచ్చిస్తాయని కూడా నమ్ముతున్నారు. కానీ, బీజేపీ దీనికి మోకాలడ్డుతోంది. ఏపీలో ఉచిత పథకాలు ప్రవేశ పెడితే.. ఆప్రభావం తమకు కీలకమైన కర్ణాటకపై పడుతుందని కమల నాథులు భావిస్తున్నారు. అందుకే ఉచితాలు మాకు వద్దని తేల్చి చెబుతున్నారు.
అంతేకాదు.. ఉచితాలను మీరు సొంతగా ప్రకటించుకోవాలని.. కూటమి పార్టీల పక్షాన ఉమ్మడిగా ప్రవేశ పెట్టే మేనిఫెస్టోలో ఉచితాలు వద్దన్నది కేంద్ర నాయకత్వం తేల్చి చెబుతున్న మాట. దీనిపై చంద్రబాబు కూడా మొండిగానే ఉన్నారు. రాష్ట్రంలో పరిస్తితిని గమనించాలని ఆయన చెబుతున్నారు. ఉచిత పథకాలు ఇప్పటికే ప్రకటించామని.. ఇప్పుడు మార్చలేమని అంటున్నారు. దీంతో బీజేపీ రెండు మేనేఫెస్టోలు ప్రకటించేందుకు రెడీ అవుతుండడం గమనార్హం. మొత్తానికి మొన్నటి వరకు అభ్యర్థులు.. ఇప్పుడు మేనిఫెస్టోలుకూటమిలో చర్చకు దారితీస్తోంది.