Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆ బీజేపీ అభ్యర్ధి జాక్ పాట్ కొట్టాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో లోక్ సభ స్థానం ఏకగ్రీవంగా గెలుచుకోవడం అసాధ్యం. కానీ గుజరాత్ లోని సూరత్ బీజేపీ అభ్యర్ధికి అదృష్టం వరించింది.
పోటీలో అభ్యర్ధులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టింది. ఇంకా నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతుండగానే ఓ లోక్ సభ స్థానం ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూరత్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలేశ్ ఖుంబానీ నామినేషన్ దాఖలు చేయగా, అతని నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ఆయన నామినేషన్ పత్రాలపై ప్రతిపాదించిన ముగ్గురు సంతకాలు ఫోర్జరీ అని తేలడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అలానే ఇతర చిన్న పార్టీల నుండి, స్వతంత్రులుగా పోటీ చేసిన 8 మంది ఇవేళ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో బీఎస్పీ అభ్యర్ధి కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం బీజేపీ అభ్యర్ధి దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. ముఖేష్ దలాల్ బీజేపీ ఎంపీగా గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి దృవీకరణ పత్రాన్ని అందించారు.