Teachers Recruitment Scam: పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2015 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చెల్లదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పరీక్షలతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా దీని కింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుండి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సీ, గ్రూప్ డీ స్టాఫ్ సిబ్బంది నియామకానికి గానూ 2016లో బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్ మెంట్ పరీక్షకు 23 లక్షల మందికిపైగా హజరైయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. అయితే ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలైయ్యాయి.
ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్ల పై విచారణకు గానూ కోల్ కతా హైకోర్టులో ప్రత్యేక బెంచ్ ఏర్పటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం .. 2016 నాటి టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ లో అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారించి అది చెల్లదని తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ను సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
అలానే నాటి ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ స్కామ్ కు సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, టీఎంసీ నేత పార్ధా చటర్జీ ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా, కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పుపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాలను రద్దు చేయడంత పాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పయిన వారు అథైర్యపడవద్దని అన్నారు. ఎనిమిది సంవత్సరాల వేతనాన్ని కేవలం నాలుగు వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యపడుతుందని సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?