BJP: ఏపీలో అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిశారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. మోడీ, చంద్రబాబు సారధ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ హయత్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గడచిన అయిదేళ్లలో వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని ఎంతో వెనక్కి తీసుకువెళ్లిందని విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్నకి ఇచ్చిన నిధులను వృధా చేశారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్ధిక వ్యవస్థగా దేశం మారబోతోందని అన్నారు. ప్రతి నెలా దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముద్రా యోజన పథకం ద్వారా స్టార్టప్ కంపెనీలకు చేయూత నిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ ప్రకటించినప్పటకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం వేల కోట్లను ఇచ్చిందని తెలిపారు.
కేంద్రం ఇచ్చిన గృహాలును ప్రజలకు అందించలేదని విమర్శించారు. వచ్చే ఐదేళ్లు ఏపిలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అందరూ చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
కాగా, అంతకు ముందు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పీయూష్ గోయల్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తొంది.
ఉమ్మడి ప్రచారాన్ని వేగవంతం చేసేలా ప్రణాళిక రూపొందించుకోనున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ప్రధాని మోడీ పర్యటనపై కూడా చర్చించినట్లు సమాచారం. ప్రధానితో కలిసి చంద్రబాబు, పవన్ ఎక్కడెక్కడ సభల్లో పాల్గొనాలి, సభ నిర్వహణ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అలానే కూటమి తరపున ప్రకటించాల్సి ఉన్న ఉమ్మడి మేనిఫెస్టో లో చేర్చే హామీలపైనా నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తొంది.
Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం