Game Changer: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శక నటుడు ఎస్. జె. సూర్య, జయరామ్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్, సునీల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో గేమ్ ఛేంజర్ ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీని 2021లోనే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథ అందించగా.. శంకర స్క్రీన్ ప్లే రాశారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలకు సహకరించారు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని 2021 సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ మూవీని స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం అయింది. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ ను షురూ చేశారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే రామ్ చరణ్ శంకర్ తో సినిమాను పట్టాలెక్కించాడు.
హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్ర ప్రదేశ్, ముంబై, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు చిత్రీకరణ జరిపారు. అయితే గేమ్ ఛేంజర్ మొదలై మూడేళ్లు అవుతున్నా.. ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఈ విషయం పట్ల మెగా అభిమానులు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందట. ఇంకా పది శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఇటీవల హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం, ఎయిర్ పోర్ట్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తాజాగా చెన్నైలో రెండు రోజులు పాటు షూటింగ్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయనున్నారట.
దీంతో ఆల్మోస్ట్ గేమ్ ఛేంజర్ మూవీ చిత్రీకరణ పూర్తి అవుతుందని బలంగా టాక్ వినిపిస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వర త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. కాగా, రామ్ చరణ్ తన 16 చిత్రాన్ని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ సినిమాను ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది.క గేమ్ చేంజెస్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే రామ్ చరణ్ ఆర్సీ16 రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.