Amaravati Capital Case: అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ను సుప్రీం కోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది. పూర్తి స్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది దర్మాసనం వెల్లడించింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీం ధర్మాసనం తోసి పుచ్చింది. డిసెంబర్ లోపు విచారణ సాధ్యం కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. ఆగస్టు నుండి నవంబర్ వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది.
Supreme Court Shocks AP Govt in Amaravti Case: రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా
అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు మూడు గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు. ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తి అయ్యిందా అని ధర్మాసనం ప్రశ్నించగా, ప్రతివాదుల్లో ఇద్దరు మృతి చెందారని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు వెల్లడించారు. మృతి చెందిన వారిని జాబితా నుండి తొలగించాలని ఏపి ప్రభుత్వం కోరింది. మృతి చెందిన వారిని జాబితా నుండి తొలగించినట్లయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్లేనని ప్రభుత్వ న్యాయవాది తెలియజేయగా, ఇంకా మరి కొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు,. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ ను లీడ్ మ్యాటర్ గా పరిగణిస్తూ తదుపరి విచారణను ఈ ఏడాది డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
జగన్మోహనరెడ్డి సర్కార్ మూడు రాజధానులకు కట్టుబడి ఉంది. ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా పేర్కొంటున్న విశాఖ నుండి పరిపాలన సాగించేందుకు సీఎం జగన్ మూహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. త్వరలో సుప్రీం కోర్టు నుండి అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావంతో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఆ క్రమంలోనే సెప్టెంబర్ లో విశాఖకు తన మకాం మార్చి పరిపాలన సాగించనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం రాజధాని కేసును డిసెంబర్ నెలకు వాయిదా వేయడం ప్రభుత్వానికి షాకింగ్ పరిణామంగా భావిస్తున్నారు.