దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్ పేరు మార్చబడింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మొఘల్ గార్డెన్ పేరు మారుస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవీకా గుప్తా తెలిపారు. ఇక నుంచి మొఘల్ గార్డెన్ను ‘అమృత ఉద్యాన్’ అని పిలుస్తారు. అమృత ఉద్యాన్ను జనవరి 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని ప్రెస్ సెక్రటరీ నవీకా గుప్తా తెలిపారు. అమృత ఉద్యాన్ను జనవరి 31 నుంచి మార్చి 29 వరకు రెండు నెలలపాటు సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నట్లు, సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నవీకా గుప్తా పేర్కొన్నారు. కాగా, ఉద్యాన్ ఉత్సవాల సమయంలో ప్రతి ఏడాది ఈ గార్డెన్లోకి నెల రోజుల పాటు అనుమతిస్తుంటారు. ఈ క్రమంలో రేపటి నుంచి సందర్శకులను అనుమతించనున్నట్లు ప్రకటించారు.
బుల్డోజర్లతో బోర్డు తొలగింపు
మొఘల్ గార్డెన్ పేరుతో ఉన్న బోర్డును బుల్డోజర్ల సహాయంతో తొలగించనున్నారు. అక్కడ ‘అమృత ఉద్యాన్’ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత ఉద్యాన్ బోర్డును ప్రారంభించి, ఆ తర్వాత రోజు నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.
రాష్ట్రపతి సలహా..
మొఘల్ గార్డెన్ పేరును మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకుంది. మొఘల్ గార్డెన్కు అమృత్ ఉద్యాన్గా పేరును సూచించింది. ఈ పేరుకు ప్రజాప్రతినిధులు, కేంద్రమంత్రులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొఘల్ గార్డెన్ పేరును మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వలస రాజ్యాల మరో చిహ్నాన్ని ముక్కలు చేయడమే కాకుండా అమృత్ కాలం పట్ల భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
మొఘల్ గార్డెన్ చర్రిత, ప్రత్యేకతలు
మొఘల్ గార్డెన్స్ పర్షియన్ శైలిలో నిర్మించబడిన తోటలు. ఇలాంటి తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టబడినవి. సాధారణంగా ఈ గార్డెన్స్ చుట్టూ ప్రహారీలు ఉంటాయి. సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చార్బాగ్కు ఇష్టమైన తోటలుగా అభివర్ణిస్తారు. ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న రామ్ బాగ్ మొట్టమొదటి చార్ బాగ్ అని సమాచారం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. ఇక రాష్ట్రపతి భవన్లో మొఘల్, పర్షియన్ ఉద్యానవనాల ప్రేరణలో మూడు గార్డెన్లు ఉన్నాయి. శ్రీనగర్లో ఇదే పేరుతో ఉన్న గార్డెన్ను అధికారులు మొఘల్ గార్డెన్గానే పిలుస్తారు. కానీ వాటికి అధికారికంగా పేరు పెట్టలేదు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్ను రాష్ట్రపతి ఆత్మగా భావిస్తుంటారు.