Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ “దేవర” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రారంభించిన నాటి నుండి వరుస ఆటంకాలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. “దేవర” మూవీ రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తారీఖు మొదటి భాగం విడుదల కావాల్సింది. సరిగ్గా షూటింగ్ తుది దశలో ఉన్న సమయంలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది.
సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైములో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ముంబైలో సర్జరీ చేయాల్సి వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి షూటింగ్ ఎక్కువ భాగం ఉండటంతో సినిమా ఏప్రిల్ కి విడుదల కావాల్సింది అక్టోబర్ కి వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఫారెస్ట్ రీజియన్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సోమవారం కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగల దాడి జరిగింది. ఈ ఘటనలో షూటింగ్స్ పార్ట్ లో ఉన్న సుమారు 20 మందికి పైగా గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. వారందరూ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పాట్ లో లేరట. ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. “వార్ 2” సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు. 2016వ సంవత్సరంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో “దేవర” మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేస్తున్నట్లు టాక్. సెకండ్ హీరోయిన్ గా మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ నటిస్తుందట. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, టామ్ షెయిన్ చాకో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా “దేవర” చిత్రీకరణ జరుపుకుంటుంది.