హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచేది వీళ్ళే అంటూ స్థానాల వారీగా అభ్యర్థుల పేర్లు వార్తల్లో వెలువడ్డాయి. టివి ఛానళ్లలో అభ్యర్ధుల ఖరారు అంటూ కొన్ని పేర్లు వెలువడిన తర్వాత కాంగ్రెస్ రంగంలోకి దిగింది. తమ పార్టీ నుంచి జాబితా అంటూ ఏదీ విడుదల కాలేదనీ, వస్తున్న వార్తలను నమ్మవద్దనీ ఎఐసిసి కార్యదర్శి మధు యాస్కి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల లిస్ట్ అంటూ దొంగ లిస్ట్ బయటకు రావడంలో టిఆర్ఎస్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉందనీ, రేపు ఎఐసిసి ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందనీ, తర్వాత మాత్రమే అభ్యర్ధుల జాబితా వెల్లడిస్తారనీ మధు యాస్కీ పేర్కొన్నారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాల్లో ఎలాగైనా గెలవాలని టిఆర్ ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తులు చేస్తున్నది.
ఇందులో భాగంగానే సామాజిక సమీకరణల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితేనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పరువు దక్కుతుందని టిపిసిసి సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఏయే స్థానం నుంచి ఎవరెవరిని బరిలో దింపాలనే దానిపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్కు సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.