అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ మెట్టు గోవింద రెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. రాయదుర్గం ఎంఎల్ఏ టికెట్ను మంత్రి, సిట్టింగ్ ఎంఎల్ఏ కాల్వ శ్రీనివాసులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
గోవిందరెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపి జేసీ దివాకర్ రెడ్డిలు రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో గోవింద రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
గోవిందరెడ్డి 2003లో టిడిపిలో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా పోటీచేసి గెలిచారు. 2009లో తిరిగి పోటీచేసి ఓడిపోయారు. 2011 లో పార్టీ ఆయనకు ఎంఎల్సిగా అవకాశం కల్పించింది. 2014లో రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేయడంతో గోవిందరెడ్డి తప్పుకున్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలని భావిస్తున్న గోవిందరెడ్డి మళ్లీ సీటు దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు.