Food Poison: పలు ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్ధినులు తరచు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కల్గిస్తొంది. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహరం కలకలం రేపింది. రాత్రి సమయంలో తీసుకున్న భోజనం వికటించి సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేజీబీవీ లో ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకూ మొత్తం 210 మంది విద్యార్ధినులు చదువుతున్నారు. నిన్నరాత్రి హాస్టల్ లో వంకాయ, సాంబారు తో కూడిన ఆహారం విద్యార్ధినులు తీసుకున్నారు. రాత్రి సమయంలో పలువురు విద్యార్ధినులు తమకు కడుపునొప్పిగా ఉందంటూ సిబ్బంది దగ్గరకు వెళ్లి చెప్పారు.
అయితే కేజీబీవీలో ఒక టీచర్, వాచ్ మన్ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్దినులను బయటకు పంపలేదు. శుక్రవారం వేకువజామున ఓ ఆటోను తీసుకువచ్చి సిబ్బంది కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్ధినులను సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది .. విద్యార్ధినులకు చికిత్స అందించగా ఓ నలుగురు మినహా మిగిలిన వారి పరిస్థితి మెరుగుపడింది. నలుగురు విద్యార్ధినులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఆత్మకూరు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. విద్యార్ధినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.
మరో పక్క విద్యార్ధినులు అస్వస్థతకు గురి అవ్వడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. విద్యార్ధులు తీసుకున్న ఆహారం కలుషితం అయ్యిందా లేక ఇంకేమైనా కారణమా అనే దానిపై విచారణ చేస్తున్నారు.