పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే వారికి వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎదురుపడ్డారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్దమంటూ తన వాహనం దిగి టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. గనుల అక్రమ తవ్వకాలు చేపట్టారంటూ బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను అక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. తమ నేతపై తప్పుడు కేసులు పెట్టారని, దీన్ని నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేపడితే అడ్డుకుంటారా అని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. సమాచారం అందుకున్న జీవీ ఆంజనేయులు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తొంది. ఎమ్మెల్యే గన్ మెన్ కు గాయాలు కావడంతో పాటు ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళుతుంటే టీడీపీ నేతలు దాడికి దిగి కారుపై రాళ్లు విసిరారన్నారు. కావాలనే వారు ప్లాన్ ప్రకారం తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేశారన్నారు. టీడీపీ కుట్రలను తాము తిప్పి కొడతామనీ, ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానన్నారు. రెండు రోజుల క్రితం తన డెయిరీ ఫామ్ ను ధ్వంసం చేశారన్నారు. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారనీ, ప్రజల తిరుగుబాటుతో తోక ముడిచారన్నారు. జీవి ఆంజనేయులుకి ప్రజాభిమానం లేదని అన్నారు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తొందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
Heavy Rains: వరద బీభత్సంతో నీట మునిగిన గ్రామాలు.. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు