టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా రూ.100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందుగా ఎటీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నానని చెప్పారు. భారత చలన చిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారన్నారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారనీ, పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారన్నారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 స్మారక నాణేన్ని ముద్రించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, అశ్వినీ దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్ హజరు కాలేదు. ఇక ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం రాలేదు. తనకు ఆహ్వానం రాకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో తనకు ఆహ్వానం రాకపోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలు రాశారు. అయినా ఆమెకు ఆహ్వానం అందలేదు.
Vijaya Sai: పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శనాత్మక ట్వీట్ .. ఒక్క క్షణం ఆలోచించమ్మా అంటూ..