మాజీ మంత్రి, టీడీపీ మహిళా నాయకురాలు పీతల సుజాతకు మరోసారి అనూహ్యంగా లక్ చిక్కనుందా ? పార్టీలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్న కొట్లాటలు, ఇటు సుజాతకు మహిళా కోటా + సామాజిక సమీకరణలతో ఆమె మరోసారి ఎన్నికల ముంగిట టిక్కెట్ ఎగరేసుకుపోనుందా ? అంటే పార్టీలో సైలెంట్గా అవుననే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఆమె టిక్కెట్ రేసులో ఎక్కడో వెనకాల ఉన్నారు. నోటిఫికేషన్కు ముందు అనూహ్యంగా ఆమె పేరు టిక్కెట్ రేసులో ముందుకు వచ్చేసింది.
రకరకాల సమీకరణలు, ట్విస్టులు అనూహ్యంగా సుజాత పేరును తెరమీదకు తెచ్చాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. ఈ మూడు సీట్లలో మూడు మాదిగ వర్గానికి ఇచ్చే పరిస్థితులు లేవు. కొవ్వూరు, గోపాలపురం సీట్లు మాదిక కమ్యూనిటీకి ఫిక్స్. గోపాలపురంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకట్రాజు పోటీ ఖాయం. ఈ సీటు మార్చడం అసాధ్యం. కొవ్వూరు టీడీపీని శాసించే పెద్దలు ఎప్పుడు మాదిగ వర్గం నేతలనే ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడ ఎన్ని ఈక్వేషన్లు మారినా ఇక్కడ మాదిగ ఈక్వేషన్ మారదంటే మారదు…. మారనివ్వరు.
కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావా లేదా ముప్పిడి రాజా మరో మాదిగ నేతా అన్నది ఒక్కటే తేలాల్సి ఉంది. ఇక మిగిలిన ఆప్షన్ చింతలపూడిని మాలలకే ఇవ్వాలన్నది అచ్చెన్నాయుడు, బాబు గారి లెక్క. ఇందులో నో డౌట్. మాల + ఆర్థిక కోణంలో బొమ్మాజీ అనిల్ పేరుపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసి ఉండేది. అక్కడ బాపట్ల జిల్లాలో సంతనూతలపాడు సీటును గత రెండుసార్లు అనిల్ అన్న విజయ్కుమార్కు ఇస్తున్నారు. ఈ సారి అక్కడ ఆయన్ను కంటిన్యూ చేస్తారా ? లేదా ఇక్కడ సీటు ఆశిస్తోన్న అనిల్ను సంతనూతలపాడులో ప్రెష్ క్యాండెట్గా దింపుతారా ? అన్న లెక్క తేలాలి. ఆ ఫ్యామిలీకి ఒక సీటు మాత్రమే గ్యారెంటీ.
అనూహ్యంగా సుజాత పేరు తెరమీదకు…
వైసీపీ గోపాలపురం నుంచి హోం మంత్రి తానేటి వనితను పోటీ చేయిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీకి పోటీ చేస్తోన్న ఏకైక మహిళ వనిత. టీడీపీ + జనసేన కూటమి నుంచి మహిళకు సర్దుబాటు చేయాలంటే సుజాత ఒక్కరే బలమైన నేత. మహిళా కోటా, పార్టీలో సీనియర్, మాజీ మంత్రి, మాల సామాజిక వర్గం ఇవన్నీ ఇప్పుడు సుజాత పేరును రేసులో బలంగా చేర్చేశాయి. పైగా జోనల్లోనే ఆమె సీనియర్ లీడర్. పార్టీ పట్ల ఎప్పుడూ క్రమశిక్షణతో పాటు విధేయురాలిగానే ఉన్నారు. 2004లో పార్టీ యాంటీ వేవ్లో కూడా ఆచంట నుంచి ఫస్ట్ టైం గెలిచిన ఆమెకు 2009లో జిల్లాలో మూడు రిజర్వ్డ్ సీట్లు ఉన్నా ఎక్కడా ఇవ్వలేదు. అయినా కిమ్మనకుండా ఐదేళ్ల పాటు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు.
2014లో చివరి నిమిషంలో ఆమె కష్టానికి బదులుగా చింతలపూడి సీటు వెతుక్కుంటూ వచ్చింది. నియోజకవర్గం మారినా ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. మూడేళ్ల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించారు. చివరకు ఎమ్మెల్యే సీటూ ఇవ్వలేదు. 2009, 2019లోనూ రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరీ త్యాగాలు చేశారు. అయినా కూడా చంద్రబాబు, అధిష్టానాన్ని కిమ్మనకుండా ఆమె పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల విజయం కోసం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఇవే చంద్రబాబు, లోకేష్ దగ్గర ఆమెకు మంచి మార్కులు పడేలా చేశాయి. ఈ విధేయతే ఇప్పుడు మళ్లీ ఆమెకు సానుకూలం అయ్యింది. ఇటీవల మాదిగ సామాజిక వర్గం నేతపై నిర్వహించిన ఐవీఆర్ఎస్ కాల్ సర్వేలోనూ పార్టీ ఊహించినంత సానుకూలత వ్యక్తం కాకపోవడం కూడా సుజాతకు కలిసొచ్చే అంశం.
ఆ సెంటిమెంట్ రిపీటయ్యేనా…
సుజాత ఎమ్మెల్యేగా గెలవడానికి 4 అంకెకు బలమైన సెంటిమెంట్ ఉంది. 2004లో గెలిచిన ఆమె 2009లో పోటీ చేయకుండా 2014లో మళ్లీ గెలిచారు. 2019లో పోటీ చేయలేదు. ఇప్పుడు 2024లో సీటిస్తే ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న నమ్మకం కూడా ఆమె అనుచరగణంలో ఉంది. పైగా చింతలపూడి నియోజకవర్గంలో ఆమెకు బలమైన వ్యక్తిగత అనుచరగణం ఉంది. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోన్న వేళ… సుజాతకు అధిష్టానం దగ్గర నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడంతో చింతలపూడి టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయి.