BRS: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే జీహెచ్ ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఇవేళ జీహెచ్ఎంసీ డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని దుశ్సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. మోతె శోభన్ రెడ్డి, శ్రీలతా దంపతులు గత కొంత కాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. శ్రీలత సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఈ కారణంగానే ఇవేళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని టాక్ నడుస్తొంది.
శ్రీలత డిప్యూటి మేయర్ గా ఉండగా, ఆమె భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. వీరు ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తొంది. రెండు మూడు రోజుల్లో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. ఉద్యమ కారులను కేసిఆర్, కేటిఆర్ అవమానపరుస్తున్నారంటూ డిప్యూటి మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోతె శ్రీలత రెడ్డి భర్త శోభన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీలత రెడ్డి 2002 లో తర్నాక డివిజన్ నుండి టీఆర్ఎస్ తరపున కార్పోరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చ్, రైల్ రోకో, చలో ఢిల్లీ వంటి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
2020 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మరల తార్నాక డివిజన్ నుండి టీఆర్ఎస్ తరపున కార్పోరేటర్ గా పోటీ చేసి గెలిచారు. 2021 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో కీలక నేతలుగా వ్యవహరించిన శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ ను వీడుతుండటం ఆ పార్టీకి బిగ్ షాక్ గా భావిస్తున్నారు.
Farmers Protest: అష్ట దిగ్బంధంలో దేశ రాజధాని ఢిల్లీ .. సింగు సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్న రైతులు