Congress: కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుండి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఇక కర్ణాటక లో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుండి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్.. మధ్య ప్రదేశ్ నుండి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ లు దాఖలునకు ఈ నెల 15వ తేదీ (గురువారం) వరకూ గడువు ఉంది.
రేణుకా చౌదరి రాజకీయ ప్రస్థానం
ఖమ్మం జిల్లా కు చెందిన రేణుకా చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బంజారాహిల్స్ నుండి పోటీ చేసి కార్పోరేటర్ గా గెలిచింది. 1986 నుండి 1998 వరకూ రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. ఇక ఖమ్మం లోక్ సభ స్థానం నుండి 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ, ఆ తర్వాత కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపిగా మరో సారి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే రాజ్యసభకు అమె పేరు ఖరారు కావడంతో ..లోక్ సభ బరి నుండి తప్పుకున్నట్లు అయ్యింది.
అనిల్ కుమార్ యాదవ్ నేపథ్యం
అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ నేత గా ఉన్నారు. ఈయన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు. 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. బీసీ సామాజికవర్గానికి చెందడంతో పాటు యవనేతగా ఉండటంతో కూడా అనిల్ కుమార్ కు కలిసి వచ్చింది. యువతకు పెద్దల సభలో అవకాశం ఇస్తే పార్టీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని భావించిన కాంగ్రెస్ .. అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తొంది.
Rajya Sabha Election: వెనక్కితగ్గిన చంద్రబాబు .. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం