Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై చంద్రబాబు వద్ద ముఖ్యనేతలు ప్రస్తావించారు.
అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. వైసీపీ నుండి నామినేషన్ లు దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా క్రాస్ ఓటింగ్ తో లాభపడవచ్చనే ఆలోచనతో రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే వైసీపీలో టికెట్ దక్కని చాలా మంది అసంతృప్తులు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి అభ్యర్ధిని బరిలో దింపితే క్రాస్ ఓటింగ్ చేస్తామని సమాచారం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.
దీంతో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపుతుందని అనుకున్నారు. ఆ క్రమంలోనే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలను ఆ పార్టీ పెద్దలు బుజ్జగింపుల ప్రక్రియ ప్రారంభించారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు మెత్తబడ్డారు. పార్టీ నిర్ణయానికి లోబడతామని చెప్పారు. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వర్ల రామయ్య ను పోటీకి దింపి అభాసుపాలైంది. ప్రస్తుతం బలం లేకుండా పోటీకి అభ్యర్ధిని నిలిపినా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు అన్నీ ఆలోచించే చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
ఇదే సందర్భంగా రా కదలి రా.. సభలు, లోకేష్ శంఖారావం మీటింగ్ తో పాటు వివిధ రాజకీయ అంశాలపైనా ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికలు కేవలం ఇంకా 56 రోజులే ఉందని కావున నేతలు పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా, వైసీపీ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారన్న ప్రచారంపై చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించగా, వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీకి టచ్ లోకి వచ్చిన మాట నిజమేనని చెప్పారు.
అయితే వైసీపీ నుండి వచ్చిన అందరినీ తీసుకోలేమని, అన్నీ ఆలోచించి నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుండో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, కంభంపాటి రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
YSRCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో ఎంపీ .. టీడీపీలో చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!