ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇప్పటికే అధికార వైసీపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే 175 ఎమ్మెల్యే అభ్యర్థులు 24 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ఒకేరోజు ప్రకటన చేసి ప్రచారంలో ముందుగా దూసుకు వెళుతుంది. ఇక విపక్ష టిడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పొత్తుపెట్టుకుని.. ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోని టీడీపీ మొత్తం 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుంది. బీజేపి ఆరు, జనసేన రెండు.. పార్టీలు పంచుకున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ పోటీ చేస్తున్న 17 పార్లమెంటు స్థానాలలో ఎవరెవరిని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించాలి అనేదానిపై పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు కసరత్తులు చేస్తున్నారు.
చంద్రబాబు ఈసారి ఆర్థిక, సామాజిక సమీకరణలు బేరిజు వేసుకుని ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. టీడీపీ పోటీ చేసే 17 పార్లమెంటు స్థానాలలో 11 సీట్లకు చంద్రబాబు అభ్యర్థులు జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే వీరిలో ఒకరు మాత్రమే సిట్టింగ్ అభ్యర్థి ఉన్నారు. మిగిలిన వారిలో అందరూ సామాజిక సమీకరణలు.. ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ ఉన్నవారు. ఆర్థికంగా ఎన్నికలను తట్టుకునే వారికి చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు ఖరారైన ఎంపీ క్యాండెట్ల లిస్ట్ ఇలా ఉంది.
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు (సిట్టింగ్), విశాఖ పట్టణం – ఎం. భరత్ (బాలయ్య రెండో అల్లుడు), అమలాపురం – గంటి హరీశ్ (దివంగత గంటి మోహన్ చంద్ర బాలయోగి కుమారుడు. భరత్, హరీష్ ఇద్దరూ కూడా గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు), విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని), గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్(ఎన్నారై టీడీపీ నాయకుడు), నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయులు(వైసీపీ టికెట్ మార్చడంతో ఆ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చి టీడీపీలో చేరారు.) కు టిక్కెట్లు ఖరారు అయ్యాయి.
ఇక ఒంగోలు నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి బరిలోకి దిగనున్నారు. శ్రీనివాసులకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో.. ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చి ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన కుమారుని ఎన్నికల బరిలోకి నిలుపుతున్నారు. నెల్లూరు నుంచి వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి.. ఇటీవల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కూడా కొవ్వూరు సీటు దక్కిన సంగతి తెలిసిందే.
ఇక చిత్తూరు నుంచి గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గుమళ్ల ప్రసాద్ తొలి ప్రయత్నంలో పోటీ చేస్తున్నారు. నంద్యాల నుంచి బైరెడ్డి శబరి రంగంలోకి దిగనున్నారు. ఆమె ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతపురం నుంచి బీసీ కోటాలో బి.కే.పార్థసారథికి సీటు ఇవ్వాలా.. లేదా గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన జెసి పవన్ కుమార్ రెడ్డికి సీటు ఇవ్వాలా అన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఇక వైసీపీ తరపున గెలిచి.. ఆ పార్టీలో రెబల్గా మారిన రఘురామకృష్ణంరాజుకి బీజేసి కోటాలో సీటు లభిస్తే ఓకే. లేకపోతే చంద్రబాబును తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నరసాపురం లేదా ఏలూరు పార్లమెంటు స్థానాల్లో ఎక్కడ ఒకచోట నుంచి సీటు ఇచ్చే ప్రయత్నం నడుస్తోంది. ఇక మిగిలిన స్థానాలకు కూడా చంద్రబాబు త్వరగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని కసరత్తులు ముమ్మరంగా చేస్తున్నారు.