శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాతపట్నం. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికలలో రెడ్డి శాంతి విజయం దక్కిం చుకున్నారు. వాస్తవానికి 2014లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. కలమట వెంకట రమణమూర్తి.. అప్పట్లో విజయం సాధించారు. 2019లో రెడ్డి శాంతికి జగన్ అవకాశం ఇచ్చారు. ఆమె విజయం సాధించారు. అయితే..ఇప్పుడు సమీకరణలు మారుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సొంత పార్టీ నేతలే.. రెడ్డి శాంతికి సెగ పెడుతున్నారు. ఆమె నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడరెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ నాయకులు.. రెడ్డి శాంతికి వ్యతిరేకంగా రెండేళ్లుగా చక్రం తిప్పుతున్నారు.
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా ఎనిమిదిసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి నారాయణరావు విజయం సాధించారు. 1989లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె మోహనరావు ఇక్కడి నుంచి విజయం దక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె మోహనరావు మరోసారి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్, 2004 ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకోగా.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా సీట్లు కోసం ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఇరు ప్రధాన పార్టీలకు ముఖ్యం కావడంతో అందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రెడ్డి శాంతి సెగ పెడుతున్న నాయకులను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను మార్చుతారా? లేక.. కొనసాగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలావుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా.. చాలా వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. రెండు సార్లు వైసీపీ గెలిచినా.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. రెడ్డి శాంతి కుటుంబ రాజకీయాలకు కూడా వారు బయట పెడుతున్నారు. ఆమె కుటుంబం సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని.. వారితో నియోజకవర్గం భ్రష్టు పడుతోందని అంటున్నారు. ఒకవైపు.. సొంత పార్టీ నేతల సెగతోనే ఇబ్బంది పడుతున్నరెడ్డి శాంతికి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేక ప్రచారం సాగుతుండడంతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.