`ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయం`- అంటూ హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో సంచల నంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు క్షణాల వ్యవధిలోనే.. రాష్ట్ర వ్యాప్తంగా పాకాయి. దీంతో దీనిపై వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో చర్చలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ డోలా యమానంలో పడిపోయింది.
అయితే.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు రాత్రికి రాత్రి విరుచుకుపడ్డారు. ఇదంతా వ్యూహంలో భాగంగా జరుగుతున్న రాజకీయ దాడిగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు.. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్ విఫలమయ్యారని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ రాజ్యమే వస్తుందని చెప్పారని.. కానీ, అక్కడ కూడా రాలేదని ఈయన పేర్కొన్నారు. ఇది నిజమే . కాదని ఎవరూ అనరు. అయితే.. ఆనాటి పరిస్థితులు.. ఆయా రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేసి అప్పట్లో కిషోర్ ఇలా వ్యాఖ్యానించి ఉండొచ్చు.
కానీ, రోజులు అన్నీ ఒకేలా ఉండవు. పైగా.. గత అనుభవాల నేపథ్యంలో మరింత సూక్ష్మంగానే పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ప్రశాంత్ కిషోర్ వంటి బలమైన వ్యూహకర్త.. ఉద్దేశ పూర్వకంగా ఏమీ చెప్పరు. ఎందుకంటే.. ప్రస్తుతానికి ఆయన లేనిపోని విషయాలే చెప్పారని అనుకున్నా.. ఇది భవిష్యత్తు లో ఆయన కెరీర్పైనే మచ్చ పడుతుంది. ఈరోజు ఒక్క ఏపీ కోసం ఆయన చూసుకుంటే.. రానున్న రోజుల్లో దాదాపు 7 నుంచి 8 రాష్ట్రాల్లో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వంటి వారు.. దూరదృష్టితోనే ఆలోచన చేస్తారు. కేవలం ఒకరికి మెప్పిం చేందుకో.. లేక ఒకరిని మచ్చిక చేసుకునేందుకో.. ఇలా చెప్పి ఉంటే అది అంతిమంగా ప్రశాంత్ కిషోర్ కెరీర్నే దెబ్బతీస్తుంది. అందుకే.. ఆచి తూచి అన్ని కోణాల్లోనూ భేరీజు వేసుకున్న తర్వాతే.. ఆయన ఈ సర్వే వివరాలను ఆయన వెల్లడించి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఏదీ 100 శాతం నమ్మడం కంటే.. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను దీనికి జోడించి నప్పుడు ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అంచనా 60 నుంచి 70 శాతం మధ్యలో నెరవేరే అవకాశం ఉందని అంటున్నారు.