ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీకలమైన నియోజకవర్గం భీమిలి. ఇప్పటి వరకు ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. రానున్న 17వ ఎన్నికకు ఈ నియోజకవర్గం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆరుసార్లు టీడీపీ, ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఇక్కడ 2019 ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకుంది. మాజీ ఎంపీ, టీడీపీ మాజీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు.
ఈ సారి కూడా ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నా.. వైసీపీ నుంచిఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందలేదు. పైగా ఆయనపై ఆరోపణలు రావడంతో మార్పు తప్పదనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. వరుసగా ఏ పార్టీకీ ఇక్కడి ప్రజలు పట్టం కట్టడం లేదు. 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కర్రి సీతారామ్ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం సాధించారు.
ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన కర్రి సీతారామ్పై 37,226 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరిపై 9712 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే.. వరుసగా ఏ పార్టీ కూడా ఇక్కడ విజయం దక్కించుకోలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగితే.. భీమిలి అడ్డాలో వైసీపీ జెండా ఎగరడం ప్రశ్నార్థకమేనని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సిటింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గడిచిన ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రిగా క్యాబినెట్లో పని చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ఇన్చార్జ్గా రాజాబాబు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.