పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలు భోగిమంటలను తలపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు ? అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ వంగా గీత మరోవైపు.. తీవ్రస్థాయిలో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. గతంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్.. ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నారు.
కానీ, నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. ఎంత పోరాటం చేస్తారో.. ఇప్పుడు ఒక్కనియోజకవర్గమే అయి నా.. అంతే పోరాటం చేస్తున్నారు పవన్. అంతేకాదు.. గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు తప్ప.. ఎవరూ ముందుకురాలేదు. పవన్ కోసం ప్రచారం కూడా చేయలేదు. అప్పట్లో రామ్ చరణ్ వస్తానని చెప్పినా.. పవనే వద్దన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇప్పుడు మాత్రం.. మెగా ఫ్యామిలీ ముందుకు కదిలింది. నాగబాబు ఫ్యామిలీ మొత్తంగా పిఠాపురంలో వాలిపోయింది. నాగబాబు, ఆయన కుమారుడు, భార్య కూడా ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ను ఎన్నికల్లో గెలిపించాలని.. అసెంబ్లీలో అడుగు పెట్టేలా చూడాలని చేస్తోన్న ప్రచారం ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ గత ఎన్నికల్లోనూ తన తండ్రి నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేసినప్పుడు తండ్రి నాగబాబుతో పాటు భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కోసం ప్రచారం చేశారు. ఇక వరుణ్ ఈ ఎన్నికల్లోనూ బాబాయ్ కోసం ప్రజలను అర్ధిస్తున్నారు. ఇదిలావుంటే. రేపో మాపో.. చిరంజీవి కూడా బరిలోకి దిగుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మే 5వ తేదీ నుంచి చిరు కూడా రంగంలోకి వస్తారని.. 10న రామ్ చరణ్ కూడా బరిలో ప్రచారం చేస్తారని అంటున్నారు. దీనిలో ఎంత వరకు నిజం ఉన్నా.. వారు ప్రచారానికి రావడం తప్పుకాదు.
కానీ, ప్రస్తుతం చిరు.. కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. పైగా.. తన పార్టీని విలీనం చేసిన తర్వాత.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా.. ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు. అనూహ్యంగా బరిలోకి దిగి.. రాజకీయంగా ప్రచారం చేస్తే.. అది సరైన సంకేతాలు ఇవ్వదని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ యాంటీ ప్రచారానికి ఇది మరింత సపోర్టు ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు. ఏదైనా ఆడియో, వీడియో రూపంలో సపోర్టు చేయడం వరకు మంచిదని చెబుతున్నారు.