ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. నంద్యాలలో అభ్యర్థులపై భారీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భూమా కుటుంబానికి భారీ షాక్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి భమా నాగిరెడ్డి కుమార్తె.. అఖిల ప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్రెడ్డిలు రెండు స్థానాలు కోరుతున్నారు. ఆళ్లగడ్డ,నంద్యాల తమకే కావాలని పట్టుబడుతున్నారు. అయితే.. గత రెండేళ్ల నుంచి కూడా సమన్వయంతో ముందుకు సాగాలని.. అందరినీ కలుపుకొని పోవాలని చంద్రబాబు నుంచి సమాచారం అందుతూనే ఉంది.
కానీ భూమా కుటుంబం మాత్రం ఒంటెత్తు పోకడలకే ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటికీ చంద్రబాబు పదే పదే చెప్పి చూశారు. అయినా ఆ కుటుంబంలో మార్పు రాకపోవడం.. పార్టీ నాయకులతో కలిసి ముందుకు వెళ్లకపోవడంతో.. తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో భూమా కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసింది. అది కూడా.. ఆళ్లగడ్డకే పరిమితం చేయాలని.. నంద్యాల కోసం వేరే వారిని చూస్తున్నారని తాజాగా సమాచారం బయటకు వచ్చింది. మాజీ మంత్రి ఫరూక్ పేరు చర్చకు వస్తోంది.
ప్రస్తుతం సీట్లు కేటాయించడంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత నంద్యాల విషయంలో భూమా కుటంబాన్ని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయింది. ఒకే కుటుంబానికి రెండేసి టికెట్ లు ఇవ్వరాదన్న నిబంధన ఒకవైపు ఉన్నప్పటికీ.. కొన్ని కొన్నిస్థానాల్లో మాత్రం పట్టు విడుపులు ప్రదర్శించారు. ఈ క్రమంలో భూమా కుటుంబానికి కూడా ఇలానే ఇవ్వాలని అనుకున్నా.. క్షేత్రస్థాయిలో పోటీ ఎక్కువగా ఉండడం… అఖిలప్రియ వల్ల పార్టీకి నష్టం జరగడం, మెజారిటీ నాయకులు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే.. ఇబ్బందులు తప్పవని పార్టీ సీనియర్లు కూడా ఓపెన్గానే చెపుతున్నారు.
కర్నూలులో వైసీపీ తీసుకునే నిర్ణయాలు.. తదనంతరం జరిగే మార్పులను నిశితంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఇక్కడ అభ్యర్థులను ఖరారు చేయాలని కూడా. . టీడీపీ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో నంద్యాల టికెట్పై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే.. చివరి నిముషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా నంద్యాల సీటు భూమా కుటుంబానికి దక్కే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా వ్యక్తిగత వ్యవహారాలతో పార్టికి ఇబ్బంది కలిగించేవారికి చంద్రబాబు పరోక్షంగా సమాధానం చెప్పినట్టు అయిందని అంటున్నారు.