జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కాదా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా ? ఈ కొత్త ప్రచారం ఏంటి ? అంటే ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వమే పవన్కు ఈ సూచనలు, సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పవన్ ఏపీ అసెంబ్లీకి పోటీ చేసినా ఎలాగూ ముఖ్యమంత్రి కాలేడు. జనసేన + టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడు. పైగా పవన్కు కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇస్తారా ? అంటే అది కూడా సందేహమే.
ఇదిలా ఉంటే ఇవన్నీ ఆలోచన చేసే బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులో భాగంగా పార్లమెంటుకు పోటీ చేస్తే తాము కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీ + జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువుగా పార్లమెంటు సీట్లు తీసుకుని పోటీ చేయాలని భావిస్తోంది. జనసేన అధినేత పవన్ను కూడా పార్లమెంటుకు పోటీ చేయించి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సలహా ఇస్తోందట.
పవన్ను కాకినాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని బీజేపీ పెద్దలు సూచించినట్టుగా తెలుస్తోంది. కూటమిలో మూడు పార్టీలో ఉన్నాయి. వీరి ముగ్గురి టార్గెట్ జగన్ను గద్దె దించడం. కూటమిలో ఉన్న ఇద్దరు ప్రధాన నేతలు చంద్రబాబు, పవన్ ఇద్దరికి న్యాయం జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం, ఇటు పవన్ కేంద్ర మంత్రిగా ఉండడమే కరెక్ట్ అని బీజేపీ పెద్దలు పవన్కు చెప్పినట్టుగా తెలుస్తోంది.
అలా కాకుండా పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా ఆర్థిక, హోం మంత్రి పదవుల్లో ఒకటి ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం ఇస్తేనే కొంత వరకు న్యాయం జరిగినట్లవుతుంది. చిన్నా చితకా మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం ఇస్తే జనసేన ఫ్యాన్స్, పవన్ అభిమానులు జీర్ణించుకోలేరు. ఇప్పటికే వాల్లు పవన్కు ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాకాకుండా మధ్యేమార్గంగా న్యాయం జరగాలంటే పవన్ పార్లమెంటుకు పోటీ చేసి కేంద్ర మంత్రి కావడమే ఉత్తమం అన్నది బీజేపీ ప్లాన్. ఓట్ల చీలిక, జనసేన – టీడీపీ కేడర్ మధ్య సమన్వయం మిస్ కాకుండా ఉండేలా బీజేపీ చూస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి కాకినాడలో పార్లమెంటుకు చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. సునీల్ ది కాపు సామాజిక వర్గం.. ఇప్పుడు పవన్ కూడా అక్కడే పోటీ చేస్తే కరెక్ట్ అన్న అంచనాల్లో బీజేపీ ఉంది. మరి పవన్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.