ఏపీలో అధికార వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులను చకచకా ప్రకటిస్తూ వస్తున్నారు. అటు ప్రతిపక్ష అధినేత, టీడీపీ నేత చంద్రబాబు మాత్రం తనకు అలవాటైన రీతిలోనే అభ్యర్థులను నాన్చుతూ వస్తున్నారు. ఓ వైపు పార్టీ కేడర్ అభ్యర్థులను ప్రకటించాలని.. పార్టీకి ఉత్సాహం తేవాలని కోరుతున్నా… పర్యటనలు చేస్తున్న చంద్రబాబు కనీసం క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో అయినా అభ్యర్థుల పేర్లు ప్రకటించడం లేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం క్లారిటీ ఉంది. ఇప్పటికే ఇంటర్నల్గా వారికి సంకేతాలు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటూ దూసుకుపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మరోసారి పోటీ చేస్తున్నారు. కొండపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయస్వామికే తిరిగి సీటు ఇస్తున్నారు. కనిగిరి, మార్కాపురంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఇన్చార్జ్లు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డే తిరిగి పోటీలో ఉంటారని చెపుతున్నా కందుల నారాయణ రెడ్డికి మార్కాపురం సీటు దక్కే విషయంలో చివరి వరకు నమ్మే పరిస్థితి లేదు.
గిద్దలూరులో గత ఎన్నికల్లో ఓడిన ముత్తముల అశోక్రెడ్డినే పార్టీ రంగంలోకి దించనుంది. యర్రగొండపాలెంలో పార్టీని గత రెండేళ్లుగా నడిపిస్తోన్న గూడూరి ఎరిక్షన్స్ బాబునే పోటీ చేయనున్నారు. ఇక దర్శి సీటును జనసేనకు కేటాయించనున్నారు. నెల్లూరు పార్లమెంటులో ఉన్న కందుకూరు సీటు విషయంలో సమీకరణలు మారుతున్నాయి. ఇక బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి, పరుచూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు మరోసారి రంగంలో ఉంటున్నారు.
సంతనూతలపాడులో ప్రస్తుత ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బీఎన్. విజయ్కుమార్ తిరిగి పోటీలో ఉంటారు. చీరాల ప్రస్తుత ఇన్చార్జ్ ఎంఎం. కొండయ్య విషయంలో పార్టీకి చాలా సందేహాలు ఉన్నాయి. అక్కడ మరో రెండు కొత్త పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. చివర్లో ఇక్కడ పార్టీ క్యాండెట్ మారే ఛాన్సులు ఉన్నాయి.