Vontimitta Srirama Kalyanam: శ్రీరామనవమిని పురస్కరించుకుని వైఎస్ఆ్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోహత్సవాల్లో భాగంగా నేటి రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా గత రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ సారి లక్షలాది మంది భక్తుల సమక్షంలో దాదాపు రూ.16 కోట్ల వ్యయంతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక ప్రాంగణంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం జగన్ తొలిసారి ఒంటిమిట్ట కల్యాణ మహోత్సవానికి హజరవుతున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వివాహ వేడుకను తిలకించనున్నారు. సుమారు 50 నుండి 60వేల మంది భక్తులు ప్రత్యక్షంగా కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకూ జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భక్తులందరికీ అక్షింతలు, అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్టలో స్వామి కల్యాణ ప్రత్యేకత
యావత్ దేశ మంతా సీతారాముల కల్యాణం నవమి రోజు పట్టపగలు జరిగితే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజున పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకూ కోదండ రాముడి కల్యాణం నిర్వహించేందుక వేదపండితులు మూహుర్తం నిర్ధారించారు. పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు..చంద్రుడికి ఇచ్చిన వరం వల్ల ఇక్కడ రాత్రి వేళ కల్యాణోత్సవం జరుపుతుంటారు. టీటీడీ నుండి వచ్చిన వేద పండితులు ఆమశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
సీఎం జగన్ పర్యటన ఇలా
నేటి సాయంత్రం 5.40 గంటలకు సీఎం జగన్ కడప విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ అతిధి గృహానికి చేరుకుంటారు. రాత్రి 7.20గంటలకు టీటీడీ అతిధి గృహం నుండి బయలుదేరి 7.30 గంటలకు 7.40 గంటల వరకూ కోదండ రామస్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరి సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకూ జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట నుండి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్ అండ్ బీ అతిధి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు (16వ తేదీ) శనివారం ఉదయం 9.10 గంటలకు కడపకు వెళతారు. అక్కడ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10.10 గంటలకు కడప విమానాశ్రయంకు చేరుకుని ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు వెళతారు.